న్యూస్రీల్
● నబరంగపూర్లో మహిళల ఆందోళన
● కలెక్టర్,ఎస్పీ కార్యాలయాల ముట్టడి
నబరంగ్పూర్ కలెక్టరేట్ వైపు ఆందోళనగా వెళ్తున్న మహిళలు, ప్రజాప్రతినిధులు
కొరాపుట్ : సంపూర్త మద్య నిషేధం కోరుతూ వేలాది మంది మహిళలు మంగళవారం నబరంగ్పూర్లో ఆందోళనకు దిగారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను ముట్టడించారు. మహిళలు తమ సంప్రదాయ ఆయుధాలు, కర్రలతో ర్యాలీగా వచ్చి మద్యం మహమ్మారికి వ్యతిరేకంగా నినదించారు. గత కొన్ని రోజులుగా పపడాహండి సమితి మైదల్పూర్ ప్రాంతంలో బీహారీ మద్యం తాగి గిరిజన యువకులు పెద్ద ఎత్తున్న చనిపోతున్నారు. దాంతో ఆ ప్రాంత మహిళలు బీహారి మద్యం, ప్రభుత్వ మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. అప్పట్లో ప్రభుత్వం గిరిజన మహిళలపై కేసులు పెట్టింది. విషయం తెలుసుకున్న మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మా ఘరో మహిళా స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ కాదంబని త్రిపాఠి నేతృత్వంలో కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో ఆ ప్రాంతంలో తాత్కాలికంగా మద్యం దుకాణాలు మూసి వేశారు. ఈ ఉద్యమం మరలా ప్రారంభం కావడంతో ప్రతిపక్ష బీజేడీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దాంతో మహిళలు ఆయుధాలతో సహా ర్యాలీ చేపట్టారు. తొలుత కలెక్టరేట్ను ముట్టడించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి మహిళలతో చర్చలు జరిపారు. అక్రమ దేశీ తయారీ మద్యం బట్టీలు, దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మహిళలు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేపట్టారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా మహిళలు ఆయుధాలతో రావడంతో పోలీసులు వారిని శాంతింపజేశారు. ఎస్పీ పార్దవ్ కశ్యప్ బయటకు వచ్చి మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే నిరసనలో పాల్గొన్న డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. కొందమాల్ జిల్లాలో గిరిజన ప్రజల డిమాండ్పై జిల్లా వ్యాప్తంగా మద్య నిషేధం కొనసాగుతుందన్నారు. అదే విధంగా షెడ్యూల్డ్ జిల్లా నబరంగ్పూర్లో కూడా మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి మాట్లాడుతూ రెండేళ్లలో జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదన్నారు. నిరసన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు, మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
రాయగడ: దేశంలో 12 ఏళ్లు, రాష్ట్రంలో రెండేళ్లు పూర్తి చేసుకుని విజయపరంపరగా ముందుకు అడుగులు వేస్తున్న బీజేపీ ప్రజల ఆదరణాభిమానాలను మరింత సమీకృతం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకుడు యాళ్ల కొండబాబు అన్నారు. పార్టీ విజయోత్సవాలను సదరు సమితి బాయిసింగ్ పంచాయతీలొ మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కొసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు ప్రజల దరికి చేరేలా అంతా కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలపై అవగాహన కలిగించడంతో పాటు అభివృద్ధి ఒడిశా, సమృద్ధి చెందిన భారత నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. అనంతరం అంత్యోదయ గృహాల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొండబాబుకు పుష్పగుచ్ఛంతో స్వాగతం
పలుకుతున్న పార్టీశ్రేణులు


