కొరాపుట్: నబరంగ్పూర్–జయపూర్ మధ్య నిర్మిస్తున్న రైల్వే ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులుగా మారినవారికి పరిహారం పంపిణీ కొనసాగుతుంది. మంగళవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రాధమిక విద్య, మైనారిటీ శాఖా మంత్రి నిత్యానంద గొండో మూడో విడత కార్యక్రమంలో భాగంగా 144 మందికి 153 కోట్ల రూపాయల పరిహారాన్ని పంపిణీ చేశారు. నందాహండి తాహసీల్ పరిధిలో భూములు కోల్పోయిన వారికి ఈ విడత పరిహారాలు అందాయి. ఈ ప్రాంతంలో 108 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. కార్యక్రమంలో పాల్గొన్న నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి మాట్లాడుతూ.. కేంద్రం బడ్జెట్లో రాష్ట్రం రైల్వే అభివృద్ధికి పది వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్లో రైల్వే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. 460 కిలోమీటర్ల పొడవుతో జునాఘడ్–నబరంగ్పూర్, నబరంగ్పూర్–జయపూర్, జయపూర్–మల్కన్గిరి, మల్కన్గిరి–భద్రచలం నిర్మాణం దేశంలో రెండవ అతి పెద్ద రైల్వే నిర్మాణంగా గుర్తింపు తెచ్చుకుంటుందని ఎంపీ బలబద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో నబరంగ్పూర్ ఎంఎల్ఎ గౌరీ శంకర్ మజ్జి, కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ పాల్గొన్నారు.


