కొరాపుట్ : కొరాపుట్ జిల్లా దమంజోడిలో భారత అల్యూమినియ కేంద్రం (నాల్కో)లో ఓ మహిళపై కీచక పర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 18న ఓ ఉద్యోగి కుటుంబానికి చెందిన మహిళ రోడ్డుపై వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె భయంతో కేకలు వేయడంతో వారు పారిపోయారు. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు దమంజోడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో మంగళవారం ఉదయం నాల్కో ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగుల కుటుంబాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టారు. నాల్కో టౌన్షిప్ వద్ద ప్రతి రోజూ బయట వ్యక్తులు వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు భద్రత పెంచాలని, అనుమానితులను ఈ ప్రాంతంలోకి అనుమతించవద్దని, రోడ్లపై లైటింగ్ పెంచాలని, సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నాల్కో హెచ్ఆర్ విభాగానికి అందజేశారు.


