జయపురం: వృక్ష సంపద లేనిదే జీవరాశికి మనుగడ లేదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఒడిశా జర్నలిస్ట్స్ యూనియన్ కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు, జయపురం సబ్ డివిజన్ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి రబి నాయక్ పిలుపునిచ్చారు. జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి కమతా గ్రామం మా మాణికేశ్వరి స్పోర్స్, కమతా కల్చెరల్ యూత క్లబ్లు సంయుక్తంగా సోమవారం చేపట్టిన వృక్షారోపణ కార్యక్రమంలో రబి నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రబినాయక్ మాట్లాడుతూ గతంలో కొరాపుట్ జిల్లా అటవీ సంపదకు ఆలవాలమై ఉండేదన్నారు. పలు ప్రాజెక్టుల వలన కాల క్రమేణా జిల్లాలో అడవులు కనుమరుగు అవుతున్నాయన్నారు. దీనివలన పర్యావరణానికి ముప్పు ఏర్పడిందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. కమతాలో కొత్తగా నిర్మిస్తున్న స్టేడియం చుట్టూ మామిడి, ఉసిరి, పనస, తదితర పండ్ల మొక్కలతోపాటు పలు రకాల ఔషధ మొక్కలు నాటారు. కమతా స్టేడియం పూర్తి చేసేందుకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గౌరవ అతిథి బీజేపీ నేత భాస్కర్ భట్ మాట్లాడుతూ.. కమతా స్టేడియం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర క్రీడా మంత్రితో సంప్రదించి సమకూర్చుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఓజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి శంకర మహాపాత్రో, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సలహాదారు కె.సికిల్ దొర, సునీల్ షొడంగి, దయానిధి పట్నాయక్, ఉపాధ్యక్షులు సుజిత్ కుమార్ పండా, సుశాంత పండా, టుటు పట్నాయక్, యూత్ క్లబ్ అధ్యక్షుడు పద్మనాభ శనాపతి, ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్ శతపతి, ఆశిష్ కుమార్ హోత్త, ప్రధాన కార్యదర్శి ముకుంద మురారీ మిశ్ర, సహాయ కార్యదర్శులు రిపున్ హోత్త, రోహణ షొడంగి, కోశాధికారి హరిశంకర శతపతి, గ్రామ యువత పాల్గొన్నారు.


