మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి అటవీ శాఖ పరిధిలో గల డైగూడా గ్రామం జూన్ 18 న ఒక ఎలుగుబంటి వాహనాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. స్థానికులు దాన్ని రాళ్లతో కొట్టారు. అటవీ శాఖ వారు ఎలుగును పట్టుకుని చికిత్సకు తరలించగా శనివారం మృతి చెందింది. దీంతో దానికి పోస్టుమార్టం నిర్వహించగా.. రాళ్ల దెబ్బలతో మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జిల్లా అటవీ శాఖ అధికారి సాయి కిరణ్ వీడియో ఫుటేజ్ల ఆధారంగా రాళ్లతో కొట్టిన ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి పై కేసు నమోదు చేశారు.
పేరుకుపోయిన చెత్త..
పర్లాకిమిడి: పర్లాకిమిడి సరిహద్దులోని పాతపట్నం మహేంద్ర తనయ నది బ్యారేజ్ వద్ద పాతపట్నం మండల పారిశుద్ధ్యశాఖ ప్రతిరోజూ చెత్తను పారబోస్తుండంతో పాతపట్నం, పర్లాకిమిడికి రాకపోకలు సాగిస్తున్న పాదచారులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఒకపక్క వంతెన దిగువన శ్మశానం వచ్చే దుర్ఘంధం, ఆవలి వైపు పాతపట్నం ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఉన్నాయి. ప్రజాఫిర్యాదుల మేరకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదివారం పాతపట్నం, పర్లాకిమిడి మధ్య ఉన్న మహేంద్రతనయ నది వద్ద పేరుకుపోతున్న చెత్తపై పురపాలక సంఘం ఈఓ లక్ష్మణ ముర్ముకు చూపించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శ్రీకాకుళం మున్సిపల్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే రూపేష్ ఫోన్ చేసి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రగతి మహిళా సంఘటన్ ఆధ్వర్యంలో పితృ దినోత్సవం
పర్లాకిమిడి: బిడ్డల పెంపకంలో తల్లి సాంగత్యం ఎటువంటిదో, ఉన్నత చదువులు చదివించి విద్యాబుధ్ధులు నేర్పించే తండ్రి కూడా అంతే బాధ్యత వహిస్తాడని దయామయ పాఢి అన్నారు. స్థానిక మహారాజా ప్యాలస్లో యుటెక్ కంప్యూటర్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జిల్లా పరిషత్ సీడీఓ దయామయ పాఢి విచ్చేసి అంతర్జాతీయ పితృదినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాల రీడర్ కమల్ సిఖా మల్లిక్, ముఖ్యవక్తగా ఇతిశ్రీ మహాపాత్రో, గౌరవ అతిథిగా విశ్రాంత బ్యాంకు అధికారి హారిమోహాన్ పట్నాయిక్ విచ్చేయగా, ప్రగతి మహిళా సంఘటన్ కార్యదర్శి తనూజా శథపతి, లోకనాథ్ మిశ్రా ఆధ్వర్యంలో జరిగింది. వృధ్ధాప్యంలో తండ్రిని చూసుకునే బాధ్యత మగబిడ్డలు కంటే..ఆడపిల్లలే ఎక్కువగా వారి ఆరోగ్యంపై శ్రధ్ధ వహిస్తారని జిల్లా పరిషత్ అధికారి దయామయా పాఢి అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు


