టెక్కలి: నాసిక్లో ఈ నెల 26 నుంచి 28 వరకు జరగనున్న జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్ మార్షల్ ఆర్ట్స్ పోటీలకు కోటబొమ్మాళి గౌతమ్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు ఎంపికై నట్లు కోచ్ సామ గౌతమ్ ఆదివారం తెలిపారు. ముంగి అర్జున్, గొండు భవి భాస్కర్నాయుడు తదితరులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. వీరిని అసోసియేషన్ ప్రతినిధులు ఆర్.దయామయ, ఎన్.లక్ష్మణ్నాయుడు, ఎం.గౌతమి అభినందించారు.
వైన్షాపులో చోరీ
హిరమండలం: మేజర్ పంచాయతీ హిరమండలంలో ఎస్బీ వైన్ షాపులో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షాపులోకి ప్రవేశించి రూ.2.30 లక్షల నగదు దోచుకుపోయారు. ఉదయం సిబ్బంది వచ్చి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న హిరమండలం పోలీసులు, క్లూస్టీమ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. హెచ్సీ సర్వేశ్వరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోను ఢీకొన్న బైక్
రణస్థలం: లావేరు మండలం రావివలస సమీపంలో ఆదివారం ఉదయం ఆటోను ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న షేక్ షాయిబ్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో రణస్థలం సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బైక్లో ఉన్న గొర్రె చర్మాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
కాంప్లెక్స్ కిటకిట
శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు, పలువురు ప్రయాణికులతో కాంప్లెక్స్ కళకళలాడింది. సరిపడా బస్సులు లేక నిరీక్షణ తప్పలేదు. బస్లు ఫుట్పాత్ వద్దకు చేరుకున్న వెంటనే సీట్ల కోసం ఎగబడ్డారు.
మాస్టార్లూ..అభినందనలు..
మందస: మందస మండల కేంద్రంలోని శ్రీ రాజా శ్రీనివాస స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తమ పిల్లలను కూ డా అదే బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారని ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు అన్నారు. తోటి ఉపాధ్యాయులు డి.నాగేశ్వరరావు, జ్ఞానేశ్వర్ గౌడ, డి.ఢిల్లీ, అరుణ్కుమార్ పాడి, కిషోర్గౌడ్లు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించడం మిగిలిన వారికీ స్ఫూర్తిగా ఉంటుందని అభినందించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యా బోధన అందుతుందని పేర్కొన్నారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
రణస్థలం: గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట(నదీ ప్రవాహం)లో పోతిరెడ్డి మురళి(24) అనే యువకుడు సరదాగా ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దీంతో స్వగ్రామం లావేరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళి హైదరాబాద్లోని విప్రో కంపెనీలో సాఫ్ట్వేరు ఇంజినీర్గా పని చేస్తున్నాడు. తన స్నేహితుడి సోదరికి నీట్ పరీక్ష కేంద్రాన్ని విజయవాడలో కేటాయించారు. దీంతో ముగ్గురూ విజయవాడ వచ్చాడు. ఆదివారం ఆమె పరీక్ష రాసేందుకు వెళ్లగా.. పక్కనే కరకట్టలో ఈత కొట్టేందుకు మురళి దిగాడు. ప్రమాదవశాత్తు మునిగిపోయి చనిపోయాడు. స్థానికులు గమనించి మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో స్వగ్రామం లావేరులో విషాదఛాయలు అలముకున్నాయి. మురళి తండ్రి వెంకటరమణ ఉప్పు వ్యాపారం చేస్తుంటారు. తల్లి సరళ గృహిణి. సోదరి ప్రసన్నకు వివాహం నిశ్చయమైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ బయలుదేరి వెళ్లారు.


