కొరాపుట్: గత రెండేళ్ల పాలనలో ఎన్నో విజయాలు సాధించామని నబరంగ్పూర్ జిల్లా ప్లానింగ్ బోర్డు చైర్మన్, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పేర్కొన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ రెండేళ్ల పాలనలో విజయాలపై వికసిత్ భారత్–వికసిత్ ఒడిశా కార్యక్రమం శనివారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో వికసిత్ భారత్, వికసిత్ ఒడిశా సాధ్యమైందన్నారు. ఆర్థిక, వైద్య, సంక్షేమ, విద్యా రంగాల్లో ఘననీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. మారుముల గిరిజన గ్రామాలకు కూడా అభివృద్ధి చేరిందని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు అవార్డులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో జొరిగాం ఎమ్మెల్యే నర్సింగ్ బోత్ర, కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, జెడ్పీ చైర్మన్ సస్మిత మెలక, కలెక్టర్ సత్యవాన్ మహాజన్, కోట్పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు పథకాలు అందజేత
రాయగడ: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సదరు సమితి కార్యాలయంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా లబ్ధిదారులకు పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు శనివారం అందజేశారు. మహిళా సాధికారత, ఆరోగ్యం, ఆహార భద్రత, స్వయం ఉపాధి, పశుసంవర్ధక రంగాల అభివృద్ధికి సంబంధించిన అనేక పథకాల కింద సహాయాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ప్రత్యేక అభివృద్ధి మండలి ఉపాధ్యాక్షురాలు మంజుల మినియాక, సమితి ఉపాధ్యాక్షుడు హరప్రసాద్ హెప్రుక, మాజీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్, బీడీవో సుజిత్ కుమార్ మిశ్రో, సీడీపీవో పానమణి హంసద, ఏబీడీ కాలు చరణ్ నాయక్, పశుసంవర్ధక శాఖ అధికారి సుబ్రత్ దాస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు సెల్ఫోన్లు అందజేశారు. అదేవిధంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 40 మందికి అంత్యోదయ అన్న యోజన పథకం కింద రేషన్ కార్డులు అందజేశారు. అలాగే మరికొందరికి పథకాలు అందజేశారు.


