జయపురం: కొరాపుట్ జిల్లాలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు జయపురం, కొరాపుట్ ఆస్పత్రుల్లో ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అత్యాధునిక మెషిన్లను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, కలెక్టర్ మనోజ్ మహాజన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాహిణీపతి మాట్లాడుతూ.. ఆస్పత్రిలో నూతన యంత్రాలు నెలకొల్పడం ఆనందదాయకమన్నారు. కలెక్టర్ మనోజ్ మహాజన్ మాట్లాడుతూ ఈ నూతన యంత్రాల ద్వారా ఒకే నమూన సేకరణతో దాదాపు 1700 కంటే ఎక్కువ రకాల పరీక్షలు చేయవచ్చని, అందువలన రోగ నిర్ధారణ ప్రక్రియ మరింత వేగంగా, ఖచ్చితంగా ఉంటుందన్నారు. పరీక్ష జరిపిన 5 నుంచి 10 నిమిషాల్లో రోగి సెల్ఫోన్కు రిపోర్ట్ పంపించడం జరుగుతందన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో నిరసన
జయపురం: భారతీయ నౌకపై అమెరికా సైనికులు కాల్పులు జరిపడంతో ముగ్గురు భారతీయ నౌకా సిబ్బంది మృత్యవాత చెందడంపై భారతీయ కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు జయపురం ప్రధాన కూడలి వద్ద కమ్యూనిస్టు పార్టీ నేతలు శనివారం ఆందోళన చేపట్టారు. ముగ్గురు భారతీయ నౌకా సిబ్బందిని అమెరికా సైనికులు హత్య చేసినా, కేంద్ర ప్రభుత్వంలో కనీసం స్పందన లేదని దుయ్యబట్టారు. ఈ ఘటనపై నిరసన తెలుపలేదు సరికదా.. కనీసం ఖండించకపోవడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ క్షేత్రస్థాయి నుంచి ప్రజా ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు. ఆందోళనలో జిల్లా కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి జుధిస్టర్ రౌళో, దామోదర రొ ణ, సురేష్ గౌడ, భీష్మ నాయిక్, ఉత్తమ మల్లిక్, నంద హరిజన్ తదితరులు పాల్గొన్నారు.
వాహనాలు సమకూర్చాలని వినతి
జయపురం: జయపురం సదర్ పోలీసుస్టేషన్ పరిధి జయపురం సమితి అంబాగుడ పోలీసు పంటికి వాహనాలు సమకూర్చాలని అంబాగుడ గ్రామస్తులు కోరారు. ఈ మేరకు సామాజిక కార్యకర్త బి.హరిరావు నేతృత్వంలో ఆ గ్రామ యువకులు జయపురం సబ్ కలెక్టర్ జాదుమణి నాయిక్ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. అంబాగుడ పోలీసు పంటి లో గతేడాది నుంచి నాలుగు చక్రాల వాహనం లేదని, అందువలన ఎక్కడ నేరాలు జరిగినా పోలీసులు సకాలంలో వెళ్లలేకపోతున్నారని తెలిపారు. అందువలన నాలుగు చక్రాలు వాహనాలు సమకూర్చాలని విన్నవించారు.
లక్క బొమ్మల తయారీ
కేంద్రం పరిశీలన
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని సుంకారి వీధిలో సరళ హస్త కళల తయారీ కేంద్రాన్ని ఎస్పీ పర్ధవ్ కశ్యప్ జగదీష్ శనివారం తల్లిదండ్రులతో కలిసి సందర్శించారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న లక్క బొమ్మలు తయారు చేసే విధానం పరిశీలించారు. సుంకారి జాతి మహిళలు తమ చేతి గోళ్ల మీదుగా లక్క కాల్చి తీగలుగా మార్చి అందమైన బొమ్మలు తయారు చేస్తారు. వీటికి దేశ విదేశాల్లో ప్రాచూర్యం ఉంది. లక్క బొమ్మల తయారీలో అనేక బహుమతులు పొందిన ప్రభాతి పాత్రో బొమ్మలు చేస్తుండడం చూసి ఎస్పీ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. అనంతరం కొన్ని బొమ్మలు కొనుగోలు చేశారు.


