విద్యుత్ సేవలందించడంలో
జయపురం: రాష్ట్రంలో టాటా పవర్ విద్యుత్ సరఫరా కంపెనీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ కంపెనీ ప్రజలకు సంతృప్తికరమైన విద్యుత్ సేవలు అందించడంలో పూర్తిగా విఫలమైందని బీజేడీ నాయకులు ఆరోపించారు. ముఖ్యంగా అప్రకటిత విద్యుత్ కోతల వలన ప్రజలు ఇబ్బందులు ఏర్పడుతున్నా కంపెనీ పట్టించుకోవడం లేదన్నారు. స్మార్ట్ మీటర్లు ద్వారా ప్రజలపై అధిక భారం మోపుతున్నారని మండిపడ్డారు. అనంతరం భారీ ర్యాలీ చేపట్టి, విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ విభాగ అధికారికి వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి రబినారాయణ నందో మాట్లాడుతూ టాటా విద్యుత్ కంపెనీపై నిప్పులు చెరిగారు. టాటా కంపెనీ విద్యుత్ సరఫరాలో నియమాలు ఉల్లంఘిస్తూ నియంతగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వెంటనే విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బీజేడీ కార్యనిర్వాహక అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ మిశ్ర, కొరాపుట్ మాజీ ఎమ్మెల్యే రఘురామ్ పడాల్, జయపురం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సూర్యనారాయణ రథ్, బీజేడీ మహిళా నాయకురాలు ఇందిరా నందో, నాగరాజు దొర, మాజీ కౌన్సిలర్ ఎ.శ్రీనివాసరావు, ధర్మేంధ్ర అధికారి, జయపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బి.సునీత, సుషమ మహాపాత్రో, బాదల్ శాంతపాత్రో, జి.అరుణ, కౌన్సిలర్లు దేవేంద్ర చౌదరి, ఎన్.లక్ష్మీనారాయణ, శిల్పపాణి తదితరులు పాల్గొన్నారు.


