పర్లాకిమిడి: బాలకార్మిక, కౌమారదశ కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ఆదనపు జిల్లా కలెక్టర్ ఫల్గునీ మఝి అన్నారు. స్థానిక జిల్లా కలెక్టరెట్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయి బాల, కౌమరదశ కార్మిక వ్యవస్థ నియంత్రణ, నిర్మూళనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 ఏళ్లలోపు వయోపరిమితి కలిగిన బాలబాలికలను జీడి, రొట్టెలు, గ్రానైట్, హోటళ్లలో పనికి పెట్టడం నేరమని డివిజనల్ లేబర్ కమిషనరు బాబుచరణ్ పాత్రో అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల హోటళ్లలో దాడులు జరిపి బాలకార్మికులను రక్షించగలిగామన్నారు. పోలీసు, జిల్లా శిశు సంరక్షణ అధికారుల సహకారం అవసరం ఎంతైనా ఉందని డీఎల్వో పాత్రో అన్నారు. గజపతి జిల్లా వ్యాప్తంగా బాలకార్మికుల నిర్మూళనకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో డివిజనల్ లేబర్ కమిషనర్ బాబూచరణ్ పాత్రో, జిల్లా శ్రామిక అధికారి అమిత్ నాయక్, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారిని మనోరమా దేవి, సీడీఎంవో డాక్టర్ మంజురాణి జెన్నా, వివిధ హోటళ్ల యజమానులు, గారబంద, హాడ్డుభంగి, కాశీనగర్ జీడిప్యాక్టరీల ప్రతినిధులు పాల్గొన్నారు.


