రాయగడ:
అమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) రాష్ట్రంలో భవిష్యత్లో తమ కార్యకలాపాలను మరింత విస్తృత పరిచి తమ ఉనికిని చాటుకునే విధంగా కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నిషికాంత్ మహాపాత్రో అన్నారు. సభ్యుల నమోదు ప్రక్రియ అభిజాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాయగడలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సర్క్యూట్ హౌస్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆప్ పార్టీ రానున్న ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతుందని చెప్పారు. కేంద్ర నాయకత్వం ఒడిశా రాష్ట్రంలో తమ పార్టీ పటిష్టతకు విస్తృత చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆ దిశగా కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి తొడ్పడేలా సూచిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని రాయగడ వంటి జిల్లాలో ఆప్ పార్టీ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల సానుభూతిని సంపాదించుకుందని అన్నారు. ఇకపై పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యేలా అంతా కలసికట్టుగా కృషి చేస్తామని అన్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలకు గుడ్బై చెప్పి ఆప్లో చేరడం పార్టీ మనుగడకు ఊతమిచ్చినట్లయ్యిందని అభిప్రాయపడ్డారు. త్వరలో జరగనున్న పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీలో నిలుపుతుందని చెప్పారు. బీజేడీ, బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆప్లో పార్టీలో చేశారు. వారికి సాదరంగా పార్టీ కండువాను కప్పి మహాపాత్రో ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షుడు జన్మాజయ్ స్వయి, కార్యకర్తలు ఈ సందర్బంగా నిషికాంత్ మహాపాత్రోను ఘనంగా సన్మానించారు.


