రాయగడ: ఇటీవల లొంగిపోయిన మావోయిస్టుల కీలక సమాచారం మేరకు జిల్లా పోలీసులు చేపట్టిన ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్లో మావోయిస్టులు దాచిపెట్టిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీవో)లో ఎస్పీ రాజ్ ప్రసాద్ ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలోని అంబోదల పోలీస్స్టేషన్ పరిధి జగదల్పూర్ అవుట్ పోస్టుకు చెందిన డెప్పాగుడ రిజర్వ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రహస్యంగా నిల్వ ఉంచిన డంప్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డంప్లో 303 రైఫిల్ –1, 37 రౌండ్ల 303 మందుగుండు సామగ్రి, ఒక మ్యాగజెన్, ఛార్టర్ క్లిప్లు, కార్డెక్స్ వైర్లు, సమారు 50 గ్రాముల గన్ పౌడర్, మావోయిస్టుల సాహిత్యం, దుస్తులు, దుప్పట్లు, గొడుగులు, కత్తులు, సబ్బులు, దువ్వెనలు, టీ ప్యాకెట్లు, చక్కెర తదితర వస్తువులను ఉన్నట్లు గుర్తించారు. కాగా ఇటీవల కాలంలో మొత్తం 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. వీరిలో రాష్ట్ర కమిటీ సభ్యులు నిఖిల్, ఇందు వంటి కీలక నేతలు ఉన్నారన్నారు.


