భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తి పురస్కరించుకుని వీరివురు విచ్చేయడం పట్ల పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహం ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఈ నెల 20న మయూర్భంజ్ జిల్లా రాయిరంగ్పూర్లో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రపతి ముర్ము జూన్ 19న రాయిరంగ్పూర్కు చేరుకోనుండగా, ప్రధానమంత్రి మోదీ జూన్ 20న అదే పట్టణానికి రానున్నారు. ఈ ఇద్దరు నాయకులు రాయిరంగ్పూర్లోని దండబోస్లో జరిగే ఒక భారీ బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ వారు పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించి, కొత్త కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటి, ఇతర ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు పహాడ్పూర్ మరియు ఇతర ప్రాంతాల్లో జరిగే స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని ఒక ప్రదర్శనను సందర్శించనున్నారు. ఉన్నత స్థాయి పర్యటనకు నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనూ గర్గ్ అధ్యక్షతన స్థానిక లోక్ సేవా భవన్లో రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూసేందుకు ప్రధాన కార్యదర్శి ఏర్పాట్లను వివరంగా సమీక్షించి, అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. సమావేశానికి అభివృద్ధి కమిషనర్ కమ్ అదనపు ప్రధాన కార్యదర్శి దేవ్ రంజన్ కుమార్ సింగ్, అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, అగ్ని మాపక, అత్యవసర సేవల డైరెక్టర్ జనరల్ సుధాన్షు షడంగి, వివిధ శాఖల కార్యదర్శులు, సీనియర్ పోలీసు అధికారులు, దూరదర్శన్, టెలికమ్యూనికేషన్స్ సేవలు, ఇతర ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. మయూర్భంజ్ జిల్లా కలెక్టర్, తూర్పు రేంజ్ ఇనస్పెక్టర్ జనరల్, రాయిరంగ్పూర్ పోలీసు సూపరింటెండెంట్ సహా సీనియర్ అధికారులు ఈ సమావేశంలో వర్చువల్గా పాల్గొన్నారు.
భద్రతా ఏర్పాట్లు, ప్రోటోకాల్ నిర్వహణ, రవాణా, హెలిప్యాడ్ సన్నద్ధత, విమానాశ్రయ ఏర్పాట్లు, అతిథుల వసతి, వైద్య, ఆరోగ్య సేవలు, అగ్ని మాపక భద్రత, నిరంతర విద్యుత్, తాగు నీటి సరఫరా, రహదారి మరమ్మతులు, పారిశుద్ధ్యం, టెలికమ్యూనికేషన్లు, మీడియా సమన్వయం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ప్రత్యేక కార్యదర్శి (హోం) రాధా కిషన్ శర్మ సమావేశంలో ప్రాథమిక సన్నాహాల వివరాలను సమర్పించారు. ముఖ్య కార్యదర్శి అనూ గర్గ్ అన్ని శాఖలు, జిల్లా యంత్రాంగం సన్నిహిత సమన్వయంతో పనిచేయాలని, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, నిర్దేశించిన కాలపరిమితిలోగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యటన పొడవునా భద్రత, నియమావళి మరియు లాజిస్టికల్ సన్నద్ధతలో అత్యున్నత ప్రమాణాలను పాటించాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు.


