రాష్ట్రంలో సాధారణ వర్షపాతం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో సాధారణ వర్షపాతం

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

భువనేశ్వర్‌: ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తే ఆందోళనలపై రైతులు భయపడవద్దని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌ కుమార్‌ పూజారి తెలిపారు. రుతు పవన కాలంలో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. వాతావరణ సూచనలు, అంచనాల ఆధారంగా మంత్రి మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో ఎలాంటి సమస్యాత్మక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం లేదన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఒడిశాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండదని తెలిపారు. సంభావ్య వర్షపాత లోటును ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్లాన్‌–2, ప్లాన్‌–3తో సహా ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించింది. సమన్వయంతో కూడిన సన్నద్ధతను నిర్ధారించడానికి వివిధ శాఖలతో చర్చలు ప్రారంభమైనట్లు వివరించారు. రుతు పవన కాలంలో రాష్ట్రానికి సుమారు 1,452 మిల్లీ మీటర్ల వర్షపాతం అవసరం. అవసరమైన స్థాయికి దగ్గరగా వర్షపాతం నమోదయ్యే సానుకూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒకవేళ ఊహించిన దానికంటే తక్కువ వర్షపాతం నమోదైనా తలెత్తే పరిణామాల్ని సమర్ధంగా నిర్వహించేందుకు విభాగం సిద్ధంగా ఉందన్నారు. నీటి సంరక్షణ, జలాశయాల పరిరక్షణ, వ్యవసాయ కార్యకలాపాలకు తోడ్పడేందుకు నీటిపారుదల ప్రాజెక్టుల అమలు, కార్యాచరణ ప్రణాళికలతో ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జల వనరులను పరిరక్షించడం, నీటిపారుదల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం వంటి చర్యలపై సంబంధిత శాఖలన్నింటినీ అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. వర్షాకాలంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement