శ్రీకాకుళం : ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, విద్యా హక్కుచట్టంలో సవరణలు చేయాలని ఫోరం ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజెషన్ (ఎఫ్ఓఆర్టీఓ) జిల్లా చైర్మన్ పిసిని వసంతరావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎఫ్ఓఆర్టీఓ కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేకుండా చట్టం చేయాలన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ నెల 15, 16వ తేదీల్లో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన విరామంలో ప్లకార్డులతో శాంతియుత ప్రదర్శన చేపట్టాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ముఖ్య సలహాదారుడు బలివాడ ధనుంజయరావు, కో చైర్మన్ బోనెల రమేష్, జిల్లా జనరల్ సెక్రటరీ బరాటం వెంకటరమణ, మిస్కా కృష్ణయ్య, వడమ శరత్, డి.రాము పాల్గొన్నారు.
శ్రీనివాసరావుకు రాష్ట్ర స్థాయి అవార్డు
రణస్థలం: లావేరు శాఖా గ్రంథాలయంలో ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు 60మంది విద్యార్థులతో వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహించిన గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావుకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పీరుకట్ల విఠల్రావు, కార్యదర్శి వి.వి.జి.ఎస్.శంకరరావు చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈయనకు అవార్డు రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.


