జయపురం: కోట్పాడ్ సమితి బతాసన గ్రామ పంచాయతీలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవ్వకుండా కాపాడాలని గ్రామ పెద్దలు, కమ్యూనిస్టు పార్టీ నేతలు కోరారు. ఈ మేరకు జయపురం సబ్ కల్క్టర్ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని నిరుపేదలు, ఆదివాసీలకు పట్టాలు పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో జుధిస్టర్ రైళో, కురుమనాథ్ భొత్ర, పూర్ణచంద్ర సురు, త్రిపతి భొత్ర, గోవర్ధన భొత్ర, ముఖుంద భొత్ర తదితరులు పాల్గొన్నారు.
ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధం
జయపురం: పట్టణంలోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణకు రోడ్ల విస్తరణ చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే మహాత్మాగాంధీ రోడ్డులో ఆక్రమణలను తొలగించి దాదాపు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశారు. కాగా ఇప్పుడు ఎన్కేటీ రోడ్డులో ఆక్రమణలు తొలగించి రోడ్డు విస్తరణకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు జయపురం మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది ఆక్రమణల తొలగింపునకు కొలతలు ప్రారంభించారు. మున్సిపల్ అధికారులు, తహసీల్దార్ కార్యాలయ సూపర్వైజర్ హరిహర శతపతి, అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సరోజ్ పాఢీ సహకారంతో రోడ్డు కొలతలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఆర్ఐ శుభస్మిత జెన, అభినాశ్ సామంతరాయ్ పాల్గొన్నారు.
పర్శాలిలో ఉచిత వైద్య శిబిరం
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి నియమగిరి పర్వత ప్రాంతం పర్శాలి గ్రామంలో డొంగిరియా కొంధొ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆదిమ తెగకు చెందిన డొంగిరియా ఆదివాసీలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జ్వరంతో ఉన్న వారి రక్త నమూనాలను సేకరించి మలేరియా పరీక్షలకు తరలించారు. మరి కొంతమందికి అవసరమైన మందులను పంపిణీ చేశారు. శిబిరంలో మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సంజ్ఞా దాస్, డాక్టర్ రాకేష్ రంజన్ పాఢి, మమత సతపతి తదితరులు వైద్య సేవలు అందించారు.
ఫ్లై ఓవర్పై వాహనాల రాకపోకలు ప్రారంభం
రాయగడ: పాత రాయగడ, కొత్త రాయగడను అనుసంధానించే స్థానిక ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు జిల్లా యంత్రాంగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిడ్జి శిథిలావస్థకు చేరుకొవడంతో ఈ ఏడాది జనవరి 10వ తేదీన మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. దీంతో బ్రిడ్జిపై వాహన రాకపోకలను నిలిపివేశారు. వాహన రాకపోకలకు సంబంధించి ప్రత్యామ్నాయంగా మార్గాల వైపు వెళ్లాల్సిందిగా జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. అయితే మరామతులు పనులు కొంత వరకు కొనసాగడంతో కేవలం బ్రిడ్జిపై ట్రాఫిక్ దృష్ట్యా ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇచ్చింది. అనంతరం పనులు పూర్తి కావడంతో అన్ని వాహనాలు రాకపొకలు కొనసాగించుకొవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరామ్మతుల్లో భాగంగా బ్రిడ్జి ఇరువైపుల ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు జాతీయ జెండా రంగులో ఉండటం అందరిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం బ్రిడ్జి పైవాహనాల రాకపోకలు యథావిధిగాకొనసాగుతున్నాయి.


