భువనేశ్వర్: ఈ నెల 21న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రూర్కెలా పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ మేరకు సంబంధిత ఏర్పాట్లు తదితర సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనూ గర్గ్ అధ్యక్షతన లోక్ సేవా భవన్లో శుక్ర వారం రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. రాష్ట్రపతి కార్యక్రమం ఆద్యంతం సజావుగా జరిగేందుకు ముఖ్య కార్యదర్శి ఉన్నతాధికారులతో సన్నాహాలను లోతుగా సమీక్షించారు. సంబంధిత శాఖలన్నింటికీ సవివరమైన సూచనలు జారీ చేశారు. ఈ సమావేశానికి అభివృద్ధి కమిషనర్ దేవ్ రంజన్ కుమార్ సింగ్, అదనపు ప్రధాన కార్యదర్శి (హోం, పరిశ్రమలు, సమాచారం, ప్రజా సంబంధాలు) హేమంత్ శర్మ, అదనపు ప్రధాన కార్యదర్శి (కార్మిక మరియు ఈఎస్ఐ, సైన్స్, టెక్నాలజీ) చిత్ర ఆరుముగం ఇతర సీనియర్ కార్యదర్శులు, అధికారులు హాజరయ్యారు. రూర్కెలా, సంబల్పూర్, ఝార్సుగుడ, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పలువురు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. ప్రత్యేక కార్యదర్శి (హోం) ఆర్. కె. శర్మ రాష్ట్రపతి పర్యటన కార్యక్రమాలు వివరించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీ ఉదయం భారత వైమానిక దళ విమానంలో న్యూ ఢిల్లీ నుంచి బయల్దేరి ఉదయం 10.25 గంటలకు ఝార్సుగుడ విమానాశ్రయంలో దిగనున్నారు. అనంతరం ఆమె ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11.10 గంటలకు రూర్కెలా విమానాశ్రయానికి చేరుకుంటారు. రూర్కెలాలో సెక్టార్ 13లో జరిగే బహిరంగ సభకు రాష్ట్రపతి హాజరవుతారు. కోయల్ నగర్లో కొత్తగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ భవన్, సైన్స్ పార్క్, ప్లానెటేరియం, ప్రమోద్ గార్డెన్ ధ్యాన్తో సహా పలు ప్రజా సంక్షేమ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఆమె రూర్కెలాలోని ఎన్టీఆర్లో ఉన్న జన జాతి మ్యూజియం మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శిస్తారు. రాష్ట్రపతి సాయంత్రం 4.50 గంటలకు ఝార్సుగుడ విమానాశ్రయం నుంచి బయలుదేరి న్యూఢిల్లీకి తిరిగి వెళ్తారు అని వివరించారు. రాష్ట్రపతి పర్యటన సమగ్ర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర హోం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని తెలిపారు.


