పర్లాకిమిడి: ప్రభుత్వ పాఠశాల గేటు విరిగి గోడ విద్యార్థులపై పడటంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన ఆర్.ఉదయగిరి బ్లాక్, రుబుడుసింగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం జరిగింది. విద్యార్థులు విరామంలో మెయిన్ గేటు వద్ద ఆడుకుంటుండగా పునాదులతో సహా గేటు విరిగి పడటంతో ఇద్దరు విద్యార్థులు ఇదాంతీ రయితో, బెకాల్స్ రయితోలు సంఘటనా స్థలంలో మరణించారు. ఈ దుర్వార్త సమాచారం తెలుసుకుని వారి తల్లిదండ్రులు, బంధువులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకుని గగ్గోలు పెట్టారు. ఆర్. ఉదయగిరి పోలీసులు ఆ మృతదేహాలను పర్లాకిమిడి మెడికల్కు పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ఈ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝి మృతుల కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి రూ.3 లక్షల చొప్పున్న ఇస్తున్నట్టు ప్రకటించారు.
21న వివాహ పథకం
నిధులు మంజూరు
పర్లాకిమిడి: ముఖ్యమంత్రి కన్యా వివాహ పథకం కింద పేద బిడ్డలకు వివాహం నిమిత్తం ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్సు హాల్లో కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ ఆధ్యక్షతన ఒక ముందస్తు సమావేశం గురువారం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన 17 వివాహిత జంటలకు ప్రభుత్వ అధికారులు ఈనెల 21న బిజూ కల్యాణ మండపంలో ఆర్థిక సాయం అందజేయడానికి అధికారులు నిర్ణయించారు. సమావేశానికి ఏడీఎం మునీంద్ర హనగ, జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారి మనోరమా దేవి, పురపాలక సంఘం ఈవో లక్ష్మణ ముర్ము, ఐఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నాగేశ్వర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
‘అవయవ దానం
ఒక గొప్ప వరం’
భువనేశ్వర్: మానవ మరణ అనంతరం కీలక అవయవాలను దానం చేయడం ఒక గొప్ప వరం అని హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ అవయవాలను మరో 8 మందికి అమర్చి వారి ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు. అవయవ దానంపై ప్రజల్లో క్రమంగా అవగాహన విస్తరించడంతో పుణ్య కార్యం అవయవ దానం కోసం వివిధ వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈ అవయవ మార్పిడి కోసం హై టెక్ మెడికల్ కాలేజీ క్యాంపస్లో ఒక ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ సిద్ధం చేసినట్లు మేనేజింగ్ ట్రస్టీ సురేష్ పాణిగ్రాహి తెలిపారు. ఈ బృహత్కార్యం కోసం హై టెక్ మెడికల్ కాలేజీతో చేతులు కలపడం ద్వారా అవయవ దాన ఉద్యమం మరింత వేగవంతం అవుతుందని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జేసీఐ) భువనేశ్వర్ అధ్యక్షుడు శ్రీనివాస్ సుబుద్ధి అన్నారు. సమాజంలో అవయవ దానం వంటి గొప్ప కార్యాన్ని ప్రోత్సహించి ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ భువనేశ్వర్, హై టెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. అవయవ దానం ప్రాముఖ్యతపై ఆధారపడిన ఆఫా చిత్ర ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. కార్యక్రమానికి హై టెక్ సీఓఓ జ్యోతిర్మయి పండా, కో డైరెక్టర్ అనిల్ పాణిగ్రాహి, డాక్టర్ మనోజ్ దాస్ పలువురు సీనియర్ వైద్యులు, సిబ్బంది హాజరయ్యారు.


