భువనేశ్వర్: పూరీ శ్రీమందిరంలో జగన్నాథుని దర్శనానికి సంబంధించి భారీ మార్పు జరిగే అవకాశముంది. స్లాట్ విధానంలో స్వామి దర్శనం కల్పించాలని యోచిస్తున్నారు. గంటల తరబడి బారులు తీరాల్సిన పని లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్విరాజ్ హరిచందన్ తెలిపారు. అతి త్వరలో స్లాట్ బుకింగ్ ద్వారా ఆలయ దర్శన విధానం ప్రారంభం కానుందని, ప్రాథమిక దశలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని చెప్పారు. అనంతరం పూర్తి స్థాయి అమలు, కార్యాచరణ ఖరారు చేస్తామని మంత్రి వివరించారు.
ద్వారాల ముంగిట స్కానర్లు..
శ్రీ మందిరం పరిసరాల్లో భద్రతా వ్యవస్థ పటిష్టపరిచే దిశలో పూరీ జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ మందిరం 4 ద్వారాల ముంగిట త్వరలో బ్యాగేజ్ స్కానర్లను ఏర్పాటు చేయనున్నట్లు పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రతీక్ సింగ్ తెలిపారు. ఆలయ ప్రాంగణానికి భద్రత కల్పించేందుకు మరిన్ని సాంకేతిక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
జయపురం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం ఎన్నిక
జయపురం: జయపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నూతన అధ్యక్షుడిగా సంజయకుమార్ జైన్ ఎన్నికయ్యారు. బి.ప్రభాకర్పై ఒక్క ఓటు ఆధిక్యతతో గెలుపొందారు. బుధవారం చాంబర్ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ ఎన్నికలలో 21 మంది డైరెక్టర్లు ఓటు వేశారు. అధ్యక్షుడిగా సంజయ్కుమార్ జైన్, ఉపాధ్యక్షులుగా సతీష్ పాత్రో, కె.దిలీప్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బి.సతీష్ కుమార్, కోశాధికారిగా సంజయకుమార్ జైన్(బొంబే స్టోర్స్), సహాయ కార్యదర్శులుగా లోకనాథ్ పాత్రో, అంకూర్ సోని, కార్యవర్గ సభ్యులుగా డైరెక్టర్లు ఎ.శ్రీనివాస రావు, వరుణ్ జైన్, బిబుదత్ పాఢీ, సీహెచ్.కిశోర్కుమార్, చందేస్ ఠాకూర్, డి.మాధవ, దినేశ్ శంకరి, గెంబలి వసంతరావు, జి.రామకృష్ణ, కెల్లా ఈశ్వరరావు, మనోజ్ కుమార్ షాహా, నేమాని చైతన్య, సూర్యనారాయణ పట్నాయిక్, వి.ప్రభాకర్ నియమితులయ్యారు.
బొగ్గు లారీ బోల్తా
రాయగడ: విశాఖపట్నం నుంచి రాయిపూర్ వైపు బొగ్గు లోడుతొ వస్తున్న లారీ సదరు సమితి పత్రాపూర్, తెప్పలరేవు ఘాటీ మలుపులో అదుపుతప్పి బోల్తా పడింది. బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో డ్రైవర్, హెల్పర్లకు గాయాలు తగిలాయి. సమాచారం తెలుసుకున్న శెశిఖాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హెల్పర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు.
‘మజ్జిగౌరి’ ప్రాంగణంలో
పాలిథిన్ వినియోగంపై ఆంక్షలు
రాయగడ: పాలిథిన్ కవర్ల వాడకాలపై పర్యావరణానికి తీరని ముప్పు వాటిళ్లుతున్న నేపథ్యంలో రాయగడలోని మజ్జిగౌరి అమ్మవారి మందిరం ప్రాంగణంలో దీని వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ట్రస్టీ రాయిసింగి బిడిక ఉత్వర్యులు జారీ చేశారు. మందిరం ప్రాంగణంలోని వ్యాపారస్తులు పాలిథిన్ వినియోగించడాన్ని నిషేధిస్తూ ఆదేశాలతో కూడిన సర్క్యులర్ విడుదల చేశారు. పాలిథిన్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈవిధమైన చర్యలు చేపట్టడం జరిగిందని.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అత్యధిక శాతం మంది భక్తులు అమ్మవారి దర్శనార్ధం నిత్యం వస్తుంటారని అందువల్ల వారు ఖరీదు చేసుకునే వస్తువులను పాలిథిన్ కవర్లలో వ్యాపార వర్గాలు అందిస్తుండటం పరిపాటిగా మారిందన్నారు. ఇకదీనికి స్వస్తి పలకాలని సూచించారు. ప్రభుత్వం పేర్కొంటున్న పర్యావరణానికి హాని తలపెట్టని బ్యాగులను వినియోగించాలన్నారు.


