మల్కన్గిరి: భక్తులంతా చూస్తుంగానే ఈత చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి నలగుంధి పంచాయతీ ఎంవీ–72 గ్రామంలో మంగళవారం చోటుచేసుకోగా.. జగదీష్ సనా (35) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బెంగాళీ సంప్రదాయ పూజల్లో భాగంగా చఢక్ పూజాను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈత చెట్టు ఎక్కి పళ్లను కోయాలి. దీంతో జగదీష్ సనా ఈత చెట్టు ఎక్కుతుండగా శక్తిని కోల్పోయి 20 అడుగుల పైనుంచి కిందకు పడిపోయాడు. అక్కడ ఉన్నవారంతా వెంటనే కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చఢక్ పూజను నిలిపివేశారు. జగదీష్ సనా ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. విషయం తెలుసుకున్న కలిమెల పోలీసులు ఆరోగ్య కేంద్రానికి చేరుకొని కేసు నమోదు చేశారు. జగదీష్ సనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు కలిమెల ఐఐసీ ప్రభుదత్త విశ్వల్ తెలిపారు.
ఈత చెట్టు పైనుంచి పడిపోతున్న జగదీష్ సనా


