రాయగడ: హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలో గల హనుమాన్ మందిరాల్లో భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి మందిరాల్లో విశేష పూజలను నిర్వహించారు. స్థానిక డైయిలీ మార్కెట్లో గల ధ్యానాంజనేయ మందిరంలో హనుమాన్ చాలిసా పఠనం, అభిషేకాలు చేపట్టారు.
కిడ్నీ వ్యాధితో విలేకరి మృతి
రాయగడ: హిందీ నవభారత్ దిన పత్రికలో పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయుడు కృష్ణకాంత్ జెన్నా (58) సోమవారం రాత్రి స్థానిక ప్రభుత్వ హాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. భార్య రాజేశ్వరి, కూమార్తె స్మృతి ఉన్నారు. జెన్నా మృతదేహానికి జిల్లా సీనియర్ పాత్రికేయులు శివాజీ దాస్, అమూల్య కుమార్ సాహు, త్రినాథ్ ఖడండ, తదితరులు మంగళవారం శ్రద్ధాంజలి ఘటించి, సంతాపాన్ని ప్రకటించారు.
2,010 కేజీల గంజాయి స్వాధీనం
పర్లాకిమిడి: భీమన్పూర్ గ్రామంలోని అడవుల్లో రవాణాకు సిద్ధంగా ఉంచిన 67 ప్లాస్టిక్ సంచుల్లో ఉన్న గంజాయి బస్తాలను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఆర్.ఉదయగిరి పోలీసు ష్టేషన్ పరిధిలో సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు నేతృత్వంలో దాడులు చేపట్టారు. సంచులను తూకం వేయగా 2010 కిలోలు ఉన్నట్టు నిర్ధారించారు. గంజాయి రవాణా చేసే నిందితులు ఎవ్వరూ పట్టుబడలేదని ఎస్డీపీఓ రాకేష్ కుమార్ సాహు తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసును నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
పౌష్టికాహారంతోనే
సంపూర్ణ ఆరోగ్యం
జి.సిగడాం : గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని ఎచ్చెర్ల ఐసీడీఎస్ సూపర్వైజర్ తమ్మినేని లక్ష్మి అన్నారు. మంగళవారం జి.సిగడాం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలతో పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహించారు. పౌష్టికాహారం, వ్యాక్సిన్ల ఆవశ్యకతను వివరించారు. అనంతరం పౌష్టికాహార ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త మహాదాస్యం రాధిక తదితరులు పాల్గొన్నారు.


