అంపశయ్యపై ఆశల దీపం
● అరుదైన మెనింజైటీస్తో బాధపడుతున్న విద్యార్థిని ● దాతల సాయం కోసం కుటుంబ సభ్యుల వేడుకోలు
రాయగడ: అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి.. ఆస్పత్రిలో అచేతన స్థితిలో పడి ఉంది. సుమారు 15 రోజుల క్రితం వచ్చిన జ్వరం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధిస్తానని చెప్పిన విద్యార్థిని మృత్యువుతో పోరాడుతుంది. తల్లిదండ్రులు తమ కుమార్తెను కాపాడుకోవడానికి దాతలు కోసం ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్.హేమలత, బాబురావు దంపతులు సదరు సమితి జేకేపూర్లోని బీసీ రోడ్డు వద్ద నివాసముంటున్నారు. వీరి కుమార్తె తేజస్విని ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఎంతో సాఫీగా సాగుతున్న వారి జీవితంలోకి సుమారు 15 రోజుల క్రితం పిడుగులాంటి కష్టం వచ్చింది. విద్యార్థిని జ్వరంతో బాధపడుతూ కోమాలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించగా అరుదైన మెనింజైటీస్ వ్యాధిగా నిర్ధారణ అయ్యింది. దీంతో విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యార్థిని చికిత్స కోసం సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కూలి చేస్తేగానీ కడుపు నింపుకోలేనివారు అంత డబ్బు సమకూర్చలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. దాతలు దయచూపి తమ కుమార్తె వైద్యానికి సాయం చేయాలని వేడుకుంటున్నారు. సాయం చేసేవారు 95333 41833 నంబర్ను సంప్రదించాలని కోరుతున్నారు.
అంపశయ్యపై ఆశల దీపం


