మహిళ బీడీవోపై బీజేపీ కార్యకర్తల దాడి
భువనేశ్వర్: కేంద్రాపడా జిల్లా రాజ్నగర్ మండలం మహిళా అభివృద్ధి అధికారి (బీడీవో)పై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్ కావడంతో శనివారం జిల్లాలో దుమారం చెలరేగింది. తిలోత్తమ పృష్టి అనే మహిళ అభివృద్ధి అధికారిపై (బీడీవో) శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే అభ్యర్థి లలిత్ బెహెరా నేతృత్వంలోని కొంతమంది ప్రజాప్రతినిధులు చర్చ కోసం మండల కార్యాలయంలో తిలోత్తమ పృష్టి దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ మధ్యలో లలిత్ బెహెరా అకస్మాత్తుగా టేబుల్ మీద ఉన్న డెస్క్టాప్ మానిటర్ను తీసుకొని బీడీవోపైకి విసిరేందుకు ప్రయత్నించాడు. ఈ సన్నివేశం బీడీవో కార్యాలయంలో సీసీ టీవీ వీడియో ఫుటేజ్ తేటతెల్లం చేస్తుందని సమాచారం. లలిత్ బెహెరా తన మద్దతుదారులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తేలడంతో ఈ సంఘటన రాజకీయ రంగు పులుముకుంది.
హన్షువా సేతుపై రాస్తారోకో
ఈ ఘటనపై బీడీవో జిల్లా మేజిస్ట్రేట్కు తెలియజేసినట్లు సమాచారం. కార్యాలయ గదిలో విధి నిర్వహణలో ఉన్న బీడీవోపై దాడికి ప్రయత్నించడంపై తీవ్ర కలకలం చెలరేగింది. ఈ దాడికి నిరసనగా శనివారం హన్షువా సేతుపై పలువురు రాస్తారోకో ఆందోళన నిర్వహించారు. ఈ మార్గంలో వాహనాల రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. బిల్లుల మంజూరు మరియు అభివృద్ధి పనులపై వాదనకు దిగిన ప్రతినిధి వర్గాలు దాడికి పాల్పడినట్లు ఆందోళనకారుల ఆరోపణ. సమగ్ర దృశ్యం సీసీటీవీలో రికార్డ్ అయినందున క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ వర్గం పట్టుబట్టింది.
మహిళ బీడీవోపై బీజేపీ కార్యకర్తల దాడి
మహిళ బీడీవోపై బీజేపీ కార్యకర్తల దాడి


