సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో పలు కోర్సులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఆర్ట్స్, సైన్స్, పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు డిసెంబర్ 9 నుంచి జరగనున్నాయని, ఈ నెల 21లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని వర్శిటీ పీజీ, ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయబాస్కర్ తెలిపారు. బీటెక్ ఏడు, ఎంసీఏ మూడో సెమిస్టర్ పరీక్షలు వచ్చే నెల మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని, వీటికి ఈ నెల 17లోగా ఫీజు చెల్లించాలన్నారు. బీటెక్ మూడు, ఐదు సెమిస్టర్లు డిసెంబర్ 10 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయని, ఈ నెల 24లోగా ఫీజు చెల్లించాలన్నారు. బీఈడీ (ఎంఆర్) మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 13నుంచి జరగనున్నాయని, ఫీజు ఈ నెల 6లోగా చెల్లించాలని సూచించారు. బీఈడీ మినహా మిగతా సెమిస్టర్ల పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతాయని వివరించారు. బీఆర్ఏయూ.ఈడీయూ.ఇన్లో షెడ్యూల్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
నదిలో యువకుడి మృతదేహం
ఎచ్చెర్ల : శ్రీకాకుళం మంగువారితోటకు చెందిన బలగ సాయి (25) అనే యువకుడు మృతదేహం ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు పంచాయతీ కాళింగపేట సమీపంలోని నాగావళి నదిలో మంగళవారం లభ్యమయ్యింది. శనివారం ఇంటిని బయటకు వెళ్లి తిరిగి చేరలేదు. మంగళవారం సాయంత్రం నదిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎచ్చెర్ల ఎస్సై సందీప్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
సీఆర్జెడ్ సమస్యపై ఆరా
గార: వత్సవలస పంచాయతీ మొగదాలపాడు గ్రామం సీఆర్జెడ్లో ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయిప్రత్యూష మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. కోస్టల్ రెగ్యులర్ జోన్లో గ్రామంలో చాలా భాగం ఉండటంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో తహశీల్దార్ ఎం.చక్రవర్తి, అధికారులతో కలిసి సరిహద్దులను పరిశీలించారు. రెవున్యూ మ్యాపుల ఆధారంగా సమస్యను గుర్తించామని, ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఈ– క్రాప్ నివేదికలు ఆధారంగా కొన్ని పొలాలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్వే ఏడీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పాముకాటుకు వృద్ధురాలు మృతి
నందిగాం: బోరుభద్రకు చెందిన తిర్లంగి అమ్మన్న (69) అనే వృద్ధురాలు పాముకాటు కారణంగా మృతి చెందింది. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మన్న నాలుగు రోజులు కిందట ఇంటి పెరటిలో ఉన్న మరుగుదొడ్డికి వెళ్లింది. అక్కడ పాము కరవడంతో కుటుంబసభ్యులకు విషయం తెలిసి మంత్రగాడి వద్దకు తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అమ్మన్నకు దివ్యాంగుడైన కుమారుడు మల్లేశ్వరరావు ఉన్నారు. నందిగాం ఎస్సై షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బారులు తీరిన లారీలు
కొత్తూరు: మండల కేంద్రం కొత్తూరులో నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద భారీ వాహనాలు బారులు తీరాయి. ఒడిశా నుంచి ఒకేసారి 15 భారీ లారీలు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. బత్తిలి, భామిని గ్రామాల మీదుగా ఇవి ఒకేసారి కొత్తూరులోకి ప్రవేశించడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల


