
గవర్నర్తో ఉప ముఖ్యమంత్రి భేటీ
భువనేశ్వర్: గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి బుధవారం ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు, ఇంధన రంగంలో సంస్కరణలు, వ్యవసాయ రంగం ప్రోత్సాహకాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను వేగవంతం చేయడానికి అన్ని విభాగాల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని గవర్నర్ ప్రస్తావించారు.
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
రాయగడ: స్థానిక ఉత్కళ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాయత్రీనగర్ వద్ద సరస్వతి శిశు మందిరంలో బుధవారం విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జూనియర్ విభాగంలో సొనాలి ప్రధాన్ ప్రథమ, హర్షిత హిమిరిక ద్వితీయ, సంజయ్ బాగ్ తృతీయ బహుమతులు సాధించారు. సీనియర్ విభాగంలో ప్రజ్ఞాశ్రీ నందో ప్రథమ, శుభశ్రీ పండా ద్వితీయ, శుధాంశు బాల భర్తియా తృతీయ బహుమతులు గెలుపొందారు. కార్యక్రమంలో అసొసియేషన్ అధ్యక్షులు దయానిధి ఖడంగా, రాయగడ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ శుభ్ర పండా, ఉత్కళ అల్యూమినియం కర్మాగారం కార్పొరేటర్ అండ్ పీఆర్ఓ పీతాంబర్ బెహరా తదితరులు పాల్గొన్నారు.
జనావాసాల్లోకి విషసర్పాలు
రాయగడ: జిల్లాలోని మునిగుడలొ కొండప్రాంతాలకు సమీపంలోని వీధుల్లో నివసిస్తున్న ప్రజలు విషసర్పాల బారిన పడి భయాందోళనలకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా విషసర్పాలు జనవాసాల్లోకి ప్రవేశించి అలజడి సృష్టిస్తున్నాయి. అసలే వర్షాకాలం కావడంతో పొదల్లో నుంచి ఇళ్లల్లోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. బుధవారం తెల్లవారుజామున ప్రమోద్ సాహు అనే వ్యక్తి ఇంట్లోకి భారీ నాగుపాము చొరబడింది. దీంతో ఆ ఇంటిలోని వారు ఆందోళన చెందారు. స్నేక్స్నాచర్ ద్వారా పామును పట్టించి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
సమష్టి కృషితోనే వర్సిటీ అభివృద్ధి ●
● వీసీ ఆచార్య కేఆర్ రజనీ
● ఘనంగా బీఆర్ఏయూ 18వ
వ్యవస్థాపక దినోత్సవం
ఎచ్చెర్ల: అందరి సమష్టి కృషితోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అభివృద్ధి జరుగుతోందని వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య కె.ఆర్.రజనీ అన్నారు. వర్సిటీ 18వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ వెనుకబడిన ప్రాంతంలో స్థాపించిన వర్సిటీ ప్రగతిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యమయ్యేలా సంకల్పించుకోవాలన్నారు. వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఎవరూ వ్యవహరించకూడదని సూచించారు. ఇటీవల విడుదలైన పీఎం ఉషా నిధులను వర్సిటీ బలోపేతానికి, మౌలిక వసతులు పెంచేందుకు, నూతన నిర్మాణాలకు వెచ్చించనున్నట్లు తెలిపారు. సిబ్బందికి ఎదైనా సమస్య ఉంటే తనకు నేరుగా తెలియజేయాలన్నారు. డిగ్రీ కళాశాలల అధ్యాపకులు పరీక్షలకు అబ్జర్వర్లను నియమించాలని అంటున్నారని, అయితే ఇన్విజిలేటర్ ఉండగా పరీక్షల్లో చూచిరాతలకు తావు ఉండదని పేర్కొన్నారు. తక్కువ బడ్టెట్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, అబ్జర్వర్లను నియమిస్తే అదనపు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.
వర్సిటీతో పేదలకు ఉన్నత విద్య
వర్సిటీ రెక్టార్ ఆచార్య బి.అడ్డయ్య మాట్లాడుతూ గిరిజన, పేద వర్గాలకు ఉన్నత విద్యనందించడంలో వర్సిటీ ముఖ్య భూమిక పోషిస్తోందన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి.సుజాత మాట్లాడుతూ గత 17 ఏళ్లలో వర్సిటీ సాధించిన విజయాలను వివరించారు. ప్రగతే ధ్యేయంగా పనిచేస్తున్న అధికారులు, వర్సిటీ వర్గాలు పరిపాలనా వ్యవస్థను దిగజార్చే పనులకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే తనకు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ శిష్యుడని, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు వద్ద మంచి పేరు ఉందని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

గవర్నర్తో ఉప ముఖ్యమంత్రి భేటీ

గవర్నర్తో ఉప ముఖ్యమంత్రి భేటీ