
అధ్వానంగా జయపూర్ రోడ్డు
కొరాపుట్: అవిభక్త కొరాపుట్ జిల్లాల్లోనే అతి పెద్ద పట్టణమైన జయపూర్–జయనగర్ మార్గం మురికి కూపంలా మారింది. పంచానన్ మందిరం నుంచి జగన్నాథ్ సాగర్ మీదుగా జయనగర్ మార్గంలో ప్రయాణం చేయాలంటే ప్రజలు హడలి పోతున్నారు. చిన్నపాటి వర్షం కురిసిన రోడ్డు బురద మయం అవుతున్నది. ఈ ప్రాంతంలో జగన్నాథసాగర్ పూడిక తీత వాహనాలు నిత్యం ప్రయాణం చేస్తుండడంతో ఆ మట్టి రోడ్డుపై పడుతుండడంతో అధ్వానంగా తయారవుతోంది. ఎండఉంటే వాహనాలు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ప్రజలు నరకాన్ని చూస్తున్నారు. ఈ మార్గం కాదనుకుంటే క్రిష్టియన్పేట, మెయిన్ రోడ్డు మీదుగా సుమారు ఆరు కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అధికారులు స్పందించి బురదను తొలగించాలని సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
వర్షాలకు ట్రాక్టర్పై కూలిన భారీ వృక్షం
కొరాపుట్: భారీ వర్షాలకు వృక్షం నేలకూలింది. బుధవారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి సెమలా గ్రామంలో భీమ్ కిర్సాని ట్రాక్టర్ మీద వృక్షం పడింది. ఆ సమయంలో మనుషులు ఎవ్వరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది. భారీ వృక్షం కావడంతో ట్రాక్టర్ దెబ్బతింది. నందపూర్ సమితి కేంద్రం నుంచి అగ్ని మాపక బృందం వచ్చి చెట్టుని తొలగించింది.
చోరీ కేసులో ఆరుగురు అరెస్టు
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీలొని కంసారిగుడలో మైత్రీ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఇనుప సామగ్రీ చోరీ కేసులో ఆరుగురు నిందితులను టికిరి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సమితిలోని పహండి గ్రామానికి చెందిన బారబార బాగ్, పద్మన్ బాగ్, భీమసేన్ ఒడాది, సుదీప్ బెనియ, అజయ్ ధల్, శేఖ్ అమీరులుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం కోర్టుకు తరలించారు. కాంసారి గుడలో మైత్రీ కంపెనీ కర్మాగారం నిర్మాణం పనులను చేపట్టింది. ఇందులో భాగంగా సెంట్రింగ్ ప్లెట్లు, ఇనుప రాడ్లు తదితర సామగ్రి దొంగతనానికి గురైంది. దీంతో కంపెనీకి సంబంధించిన పీఆర్వో ఆశీష్ కుమార్ టికిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం నాడు పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో సనోమాటికొన కూడలిలో ఇనుప రాడ్లను బైకులపై తీసుకువెళుతున్న యువకులను పట్టుకున్నారు. వారిని విచారించగా ఇనుప సామగ్రిని తామే దొంగిలించి వేరే వారికి విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. దీంతో సామగ్రిని దొంగతనం చేసిన వారితోపాటు కొనుగోలు చేసిన వారిపని కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు.
11 అడుగుల కొండచిలువ పట్టివేత
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీపీ 22 గ్రామంలో నివసిస్తున్న తుషార్ కాంత్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో 11 అడుగుల కొండ చిలువ హల్చల్చేసింది. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో పాము కనిపించడంతో కలిమెల స్నేక్హెల్ప్ లైన్ రాకేష్ హల్దార్కు సమాచారం ఇచ్చారు. ఆయన తన సిబ్బందితో వచ్చి పామును పట్టుకున్నారు. ఉదయం అడవిలో విడిచిపెట్టారు.

అధ్వానంగా జయపూర్ రోడ్డు