
22 నుంచి సామూహిక సెలవులు
జయపురం: అటవీ విభాగ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు ఆందోళన బాట పట్టారు. మంగళవారం నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. తమ డిమాండ్లు ఆమోదించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని అటవీ విభాగ జయపురం జోనల్ సంఘ కార్యదర్శి గౌతమ స్వైయ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా గౌతమ స్వైయ్ మాట్లాడుతూ గత మే నెల 24 వ తేదీన డెంకానల్ అటవీ డిబిజన్లో ప్రహ్లాద్ ప్రధాన్ పెట్రోలింగ్ చేస్తున్నారని, ఆ సమయంలో వేటగాళ్ల తూటాలకు గురై అతతడు మరణించాడని వెల్లడించారు. ప్రహ్లాద్ ప్రధాన్ కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. నాన్గెజిటెడ్ అటవీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించేందుకు అటవీ ఆయుక్త ఏర్పాటు చేయాలని, పోలీసులకు వలే అటవీ విభాగ సిబ్బందికి బీమా సౌకర్యం కలిగించాలని తాము ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్నామని, అయితే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ నెల 22వ తేదీ ఉద్యోగులు అందరూ సామూహిక సెలవు పెట్టి అటవీ డివిజన్ కార్యాలయం ముంగిట ధర్నాలు చేస్తామన్నారు.