
ప్రధాని మోదీ పర్యటన రేపు
భువనేశ్వర్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక రోజు రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ప్రధాని పర్యటన పురస్కరించుకుని భారీ సన్నాహాలు చేస్తున్నారు. స్థానిక లోక్ సేవా భవన్లో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాన మంత్రి ఈ నెల 20న మధ్యాహ్నం 2.05 గంటలకు ఉత్తర ప్రదేశ్లోని కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక వైమానిక దళ విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 3.40 గంటలకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుతారు. అక్కడి నుంచి ప్రధాన మంత్రి నేరుగా సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరి జనతా మైదాన్కు చేరుకుంటారు. అగ్నిమాపక సేవల శాఖ ఏర్పాట్లు, పత్రికా సమన్వయం, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ద్వారా ఆకస్మిక ప్రణాళిక, ఆరోగ్యం, వైద్య సౌకర్యాలు, రోడ్డు నిర్వహణ, పారిశుద్ధ్యం, అసెంబ్లీ ప్లాట్ఫారం సెటప్, పాస్ జారీ, మీడియా ప్రచారం, వేదికల వద్ద ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి అంశాలపై తదుపరి చర్చలు జరిగాయి. ఈ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి హోం శాఖ అదనపు కార్యదర్శి (ప్రోటోకాల్) పర్యవేక్షణలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. ప్రధాన మంత్రిని స్వాగతించడానికి స్థానిక విమానాశ్రయం, రాజ్ భవన్, కళింగ స్టేడియం, జయదేవ్ విహార్, జనతా మైదాన్ వంటి కీలక ప్రదేశాలలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. జనతా మైదాన్లో సభకు భారీ సంఖ్యలో జనసమూహం వచ్చే అవకాశం ఉన్నందున రద్దీ నిర్వహణ, అనుబంధ కార్యకలాపాలను క్రమబద్ధంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికను ఖరారు చేశారు. స్థానిక జనతా మైదాన్ బహిరంగ స్థలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఈ పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.

ప్రధాని మోదీ పర్యటన రేపు