గన్నవరం: మండలంలోని దావాజిగూడెం, అల్లాపురం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత దావాజీగూడెం మోడల్ స్కూల్ ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడి వసతులను పరిశీలించారు.
అంగన్వాడీకి వచ్చే చిన్నారుల సంఖ్యను పెంచాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులు హాజరు, పౌష్టికాహారం పంపిణీ వివరాలను యాప్ ద్వారానే నిర్వహించాలని చెప్పారు. హాజరు పట్టికలు, రికార్డుల్లో రాయడం వంటి పాత పద్ధతులకు స్వస్తి పలకాలని ఆదేశించారు. అనంతరం చిన్నారులు ఎత్తు, బరువులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అల్లాపురం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన డైరెక్టర్ టాయిలెట్స్, టీవీ, తాగునీటి సదుపాయలను పరిశీలించారు. కేంద్రం నిర్వహణపై ఐవీఆర్ఐ కాల్స్లో ప్రజలు ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తపరచడంపై విచారించారు. ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎన్ రాణి, గన్నవరం ప్రాజెక్ట్ సీడీపీఓ జి. మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.


