కోనేరుసెంటర్: కూటమి పాలనలో మద్యం సిండికేట్ రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కేస్తోంది. విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటోంది. బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తూ ప్రజా ధనాన్ని దోపిడీ చేసేస్తోంది. నియోజకవర్గంలో ఓటర్లకు చుక్క నీరు దొరకని పరిస్థితి ఉందేమోగానీ.. మందు చుక్క దొరకని సందు లేదు అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ముఖ్యంగా బందరు మండలంలోని కొంత మంది మద్యం వ్యాపారుల అవినీతి దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. వైన్ షాపుల్లోని మద్యాన్ని పల్లెలతో పాటు పట్టణంలోనూ ఏరులై పారిస్తున్నారు. వైన్షాపుల్లో నడిచే వ్యాపారం చాలదన్నట్టు పచ్చటి పల్లెల్లో బెల్టుషాపులు పెట్టించి మరీ దొడ్డిదారిన లిక్కర్ బాటిళ్లను సరఫరా చేస్తూ లక్షలకు లక్షలు ఆర్జిస్తున్నారు. ఈ తతంగమంతా ఎకై ్సజ్శాఖకు తెలిసే నడుస్తున్నా పట్టించుకునే నాథుడు ఉండటంలేదని బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి.
తిలా పాపం తలా పిడికెడు..
బందరు మండలంలో మద్యం వ్యాపారులు అంతా కుమ్మక్కయ్యారు. పార్టీలు ఏవైనా ఒకరికొకరు స్నేహంతో మెలుగుతున్నారు. సొమ్ము ఎవడికి చేదు అన్నట్టు బెల్టుషాపులకు మద్యాన్ని తరలించి అక్రమార్జనను తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు పంచుకుంటున్నారు. దీంతో అందరూ అధిక ధరలకు మద్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.


