జి.కొండూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మైలవరంలో సోమవారం రాత్రి పది గంటల సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జి.కొండూరు మండల పరిధి కుంటముక్కల గ్రామానికి చెందిన తమండ్రు వేణు(25) తన బైక్పై మైలవరం నుంచి కుంటముక్కల వెళ్తుండగా మైలవరం మార్కెట్ యార్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన వేణు తలకి తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. క్షతగాత్రుడిని స్థానికులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుడు వేణు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.


