ఇబ్రహీంపట్నం: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీటీపీఎస్ పాత గేటు వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రీజనల్ అధ్యక్షుడు ఎస్కే సలీం, రీజనల్ కార్యదర్శి ఎం.రవీంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా కార్మికుల వేతనం రూ.43వేలు, పెండింగ్లో ఉన్న కరువు భత్యం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. రమేష్, కోశాధికారి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షుడు టి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


