కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని
గుడ్లవల్లేరు: గ్రామీణాభివృద్ధిలో యువ ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో 25వ స్నాతకోత్సవం శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెమ్మసాని పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సంపాదించిన డిగ్రీని కేవలం విద్యార్హతగా కాక సమాజాభివృద్ధికి దోహదపడే సాధనగా మలచుకోవాలన్నారు. వ్యవసాయం, పారిశుద్ధ్యం, తాగునీరు, డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో యువ ఇంజినీర్ల సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంజినీరింగ్ కళాశాలలు పరిశోధకులు, వ్యవస్థాపకులను తయారు చేసే సంస్థలుగా రూపుదిద్దుకోవాలని సూచించారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల విద్య ప్రతిభావంతులకు, జ్ఞాన సముపార్జనకు, శ్రేష్ఠతకు నిలయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి వల్లూరుపల్లి సత్యనారాయణ, సహ కార్యదర్శి వల్లూరు పల్లి రామకృష్ణ, కళాశాల సభ్యులు వల్లూరుపల్లి వెంకట కిరణ్, ముసునూరి శ్రీరామ్, డైరెక్టర్ డాక్టర్ పి.సిద్ధయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణ కుమార్, యాజమాన్య సలహాదారు డాక్టర్ పి.రవీంద్రబాబు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.కోదండ రామారావు, డాక్టర్ ఎం.ఆర్.సి.హెచ్.శాస్త్రి, పీజీసీఆర్డీ డైరెక్టర్ డాక్టర్ జి.వి.ఎస్.ఎన్.ఆర్.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


