గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): మండలం పరిధి లోని గుంటుపల్లి డాన్బోస్కో స్కూల్లో రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీలు గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. యోగాంధ్రలో భాగంగా జరిగిన యోగా పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 800 మంది యోగా సాధకులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి డాక్టర్ సుజాత, పోటీల రాష్ట్ర నోడల్ అధికారి ఝాన్సీలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఎస్.ఇలక్కియ పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈ పోటీలు యోగాంధ్ర– ఆంధ్రాస్ గ్లోబల్ యోగా షోకేజ్ థీమ్తో జరుగుతున్నాయన్నారు. గ్రామ, మండల, జిల్లాస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని వివరించారు. వ్యక్తిగత కేటగిరీ, గ్రూపు కేటగిరీల్లో జూనియర్, యంగ్, సీనియర్ గ్రూప్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వై.రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.


