వైఎస్సార్ సీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి సోషల్ మీడియాపై ప్రభుత్వ అణచివేతను వ్యతిరేకిస్తూ నిరసన
వైఎస్సార్ సీపీ గొంతు నొక్కాలని..
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. భారత రాజ్యాంగాన్ని కాలరాస్తూ.. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సోషల్ మీడియాపై ప్రభుత్వం అవలంభిస్తున్న అణచివేత ధోరణిని వ్యతిరేకిస్తూ మంగళవారం వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగాగల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా సైనికులపై ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన చింత కాయల విజయ్ను రాజ్యసభకు పంపించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 800 మంది సోషల్ మీడియా సైనికులపై అక్రమ కేసులు పెట్టారని, ఈ కేసులకు ఎవరూ భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
కేసులు బనాయించి వేధించారు..
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు బనాయించి వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. ఫేస్ బుక్, ఎక్స్ వంటి వేదికల ద్వారా కూటమి పాలనను ప్రశ్నిస్తుంటే ప్రభుత్వ పెద్దలు తట్టుకోలేక పోతున్నారన్నారు. భయపెట్టే రాజకీయాలు చేస్తూ బెదిరించాలని చూస్తున్నారని, దానికి భయపడేవారెవరూ లేరని గ్రహించాలని హితవు పలికారు.
భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి..
ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై తమ భావాలను స్వేచ్ఛగా ప్రకటించే అవకాశాన్ని డాక్టర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం కల్పించిందని, దానిని ప్రభుత్వం హరిస్తోందని తిరువూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నవారిని అణచివేయడం చూస్తుంటే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమని అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, కృష్ణాజిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షురాలు పడిగపాటి చైతన్యరెడ్డి, సర్నాల తిరుపతిరావు, ఆళ్ల చెల్లారావు, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గ పరిశీలకులు తంగిరాల రామిరెడ్డి, కర్నాటి రాంబాబు, జిల్లా పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అలీమ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలపై ప్రభుత్వం దాష్టీకం ప్రదర్శిస్తూ గొంతు నొక్కాలని చూస్తోందని విమర్శించారు. ఇప్పటికే 800 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని, వారిలో 55 మందిని అన్యాయంగా రిమాండ్కు పంపారని గుర్తు చేశారు.


