మధురానగర్(విజయవాడసెంట్రల్): యోగాభ్యాసంతో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర–2026లో భాగంగా ఆదివారం నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో విద్యాశాఖ, వీఎంసీ ఆధ్వర్యాన విద్యార్థుల థీమ్తో ప్రత్యేక యోగాభ్యాసన జరిగింది. కార్యక్రమంలో సుమారు 600 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 45 నిమిషాల పాటు కామన్ యోగా ప్రొటో కాల్ను అభ్యసించారు. కలెక్టర్ లక్ష్మీశ విద్యార్థులతో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఒక ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. విద్యార్థి దశలో యోగాను అలవాటు చేసుకుంటే ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారన్నారు. యోగాంధ్రతో ఆరోగ్యకర సమాజ నిర్మాణమే లక్ష్యమని, ప్రతి ఒక్కరూ యోగాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. డీఈవో చంద్రకళ మాట్లాడుతూ యోగాతో ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆరోగ్యం మరింత మెరుగవుతుందని, ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని, రోగనిరోధక శక్తి పెరిగి మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుందనీ తెలియజేశారు, కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఆర్. రమేష్ బాబు, డీవైఈవో డి.సాంబశివరావు, యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, జిల్లా ఆయుష్ అధికారి డా. వై.రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.


