● యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
మనోహర్కుమార్
● జూలై 15న నిరాహార దీక్ష
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో జూలై 15వ తేదీ వరకూ వివిధ రూపాల్లో పోరాటం చేయనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్కుమార్ తెలిపారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆ సంఘ రాష్ట్ర కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. మనోహర్కుమార్ మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ టెట్ అర్హత సాధించాల్సిందేనన్నారు. 2028 ఆగస్టు 31 తేదీ వరకు టెట్ అర్హత సాధించడానికి అవకాశం ఇస్తామని తెలిపిందన్నారు. ఉపాధ్యాయుల ఆందోళన దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేంద్రప్రభుత్వంతో మాట్లాడి విద్యాహక్కు చట్టం 23(1)లో సవరణకు ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక టెట్కు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక టెట్కు నోటిఫికేషన్ విడుదల చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ విద్యా హక్కు చట్ట సవరణకు, ప్రత్యేక టెట్ నిర్వహణ కోసం ఆందోళన కార్యాచరణను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. జూన్ 13 నుంచి 16 వరకు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని, జూన్ 30వ తేదీ ఒకరోజు మండల కేంద్రాల్లో నిరసన దీక్ష, జూలై రెండవ తేదీ జిల్లా స్థాయిలో ఒకరోజు నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. జూలై 15 రాష్ట్రస్థాయి నిరాహార దీక్ష చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య, సహాధ్యక్షులు ఎం.కృష్ణయ్య, సహాధ్యక్షురాలు పి.భవాని తదితరులు పాల్గొన్నారు.


