● ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టిన కంటైనర్ ● బాపులపాడు మండలం వీరవల్లి వద్ద దుర్ఘటన
హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం వీర వల్లి వద్ద చెన్నయ్ – కోల్కతా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవంగా దహనమయ్యాడు. ఆగిన ఉన్న టిప్పర్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ఢీ కొట్టింది. కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ దుర్ఘటన జరిగింది. వీరవల్లి బైపాస్ రోడ్డులోని ఫ్లై ఓవర్పై శనివారం తెల్లవారు జామున మరమ్మతుల కారణంగా టిప్పర్ ఆగిపోయింది. దీనిని గమనించని కంటైనర్ లారీ వెనుక వేగంగా వచ్చి టిప్పర్ను ఢీకొట్టింది. దీంతో కంటైనర్ లారీ ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గన్నవరం, హనుమాన్జంక్షన్ ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరు కుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కంటైనర్ లారీ క్యాబిన్లో చిక్కుకుపోయిన డ్రైవర్ తవిటికి సురేంద్ర (22) సజీవంగా దహనమయ్యాడు. సురేంద్ర స్వస్థలం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పేరారం. కంటై నర్ లారీలో ఉన్న మరో డ్రైవర్ వంగలపూడి ప్రసాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


