కిటకిటలాడిన విజయవాడ హోల్సేల్ పూల మార్కెట్
పూలదండలకు భలే గిరాకీ..
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణా మెయిన్ కెనాల్ సమీపంలోని రాజీవ్గాంధీ హోల్సేల్ పూల మార్కెట్ వినియోగదారులతో బుధవారం కిటకిటలాడింది. గురువారం పండుగను పురస్కరించుకొని పూజలకు, ఇతర అలంకరణ నిమిత్తం పూలను తీసుకెళ్లేందుకు నగర వాసులు భారీగా మార్కెట్కు తరలివచ్చారు. అందుకనుగుణంగా రైతులు కూడా భారీగా పూలను మార్కెట్కు తరలించారు. బంతి, చామంతి, మల్లి, లిల్లీ, గులాబీ పువ్వులు భారీగా వచ్చాయి. నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయం రోడ్డు మొత్తం వినియోగదారులు, వాహన చోదకులతో కిక్కిరిసిపోయింది. మార్కెట్లో పువ్వులు కొనుగోలు చేయటానికి వచ్చిన వినియోగదారులు ముందుకు సాగటానికి దారి లేక తోపులాటలు చోటు చేసుకున్నాయి.
ధరలు.. భారీగా పెంచేశారు..
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పూల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. రెండు రోజుల క్రితం ఉన్న ధరలు రెట్టింపయ్యాయి. ఆ ధరలను విని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మొన్నటి వరకూ కనకాంబరాలు కిలో రూ.200 నుంచి రూ.400 పలుకగా బుధవారం ఉదయం రూ.800, సాయంత్రం రూ.1000 మేర ధర పలికింది. అదేవిధంగా మల్లెపూలు మొన్నటి వరకూ కిలో రూ.200 మాత్రమే ఉండగా బుధవారం రూ.600 దాటింది. వాటితో పాటుగా చామంతి, గులాబీ ధరలు సైతం నాలుగు రెట్లు పెరిగి మూడు వందల నుంచి నాలుగు వందల వరకూ అమ్మకాలు జరుగుతున్నాయి. అలాగే లిల్లీ మొన్నటి వరకూ వంద నుంచి మూడు వందల రూపాయలు పలుకగా, బుధవారం రెండు రెట్లు పెరిగాయి. ఈ ధరలు గత ఏడాది రెట్టింపుగా ఉన్నాయని వ్యాపారులు వివరించారు. పూల ధరలు హోల్సేల్ మార్కెట్లో ఈ విధంగా పలుకుతుంటే రిటైల్గా ఇళ్ల వద్ద ఆ ధరలు మరింత పెరిగి వినియోగదారులకు మరింత భారమయ్యాయి.
మార్కెట్లో పూలదండలకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా ఆలయాలు, ఇళ్లలో దేవుని విగ్రహాలతో పాటుగా అలంకరణకు దండలు వినియోగిస్తారు. అదే విధంగా దస్త్రాలు ఉన్న దుకాణాదారులు సైతం భారీగా పూలదండలను తీసుకెళ్లారు. అదేవిధంగా పండుగ సందర్భంగా వివిధ సభా కార్యక్రమాలను నిర్వహించే సంస్థలు సైతం దండలకు ఆర్డర్లు ఇచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. వీటి ధరలు రూ.200 నుంచి రూ.1000 వరకూ పలుకుతున్నాయి.


