పామర్రు: రైతులు యూరియా వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించి, అధిక ఆదాయం పొందాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపు నిచ్చారు. మండల పరిధిలోని పలు గ్రామాలలో కలెక్టర్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. తొలుత పామర్రు మండలంలోని కురుమద్దాలి గ్రామం సందర్శించి రైతన్నా.. మీ కోసం కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. గతేడాది బుడమేరు వరదల కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించామని, ఒక వైపు రసాయనిక ఎరువులు వేసిన వరి పొలం, దాని పక్కనే ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన వరి పొలం గమనించామని అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పంట నిటారుగా నిలిచిందని, మంచి దిగుబడి వచ్చిందని చెప్పారు. రసాయన ఎరువులతో సాగు చేసిన వరి పంట దిగుబడి లేక రైతు నష్ట పోయారని అన్నారు. గ్రామంలో కూలీల సమస్య ఉందని రైతులు కలెక్టర్కు చెప్పగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అవసరమైన వారికి డ్రోన్లు పంపిస్తామని వాటిని వినియోగించుకోవాలని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రం సందర్శన..
అనంతరం కలెక్టర్ ఇటలీకి చెందిన కేర్ టు యాక్షన్ స్వచ్ఛంద సంస్థ సమకూర్చిన నిధులతో పునరుద్ధరించిన అంగన్వాడీ సక్షం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి చిన్నారులతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ వారి పేర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పామర్రులోకి చాట్లవానిపురంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని, ప్రణాళిక చిత్రపటాన్ని పరిశీలించారు.
దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం..
పామర్రులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పామ ర్రు సచివాలయం–1లో రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ప్రారంభించిన దివ్యాంగ శక్తి పథకాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఉయ్యూరు ఆర్డీవో శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, ఏపీఈడబ్ల్యూఎస్ ఐడీసీ ఈ రాజన్న, తహసీల్దార్ రవికాంత్, డెప్యూటీ ఎంపీడీవో గంగాధర్రావు, మండల వ్యవసాయ అధికారి శివ నాగరాణి, ఏఈ రాజేష్, వసతి గృహం సంక్షేమ అధికారి వీణకుమారి తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ


