
మహా యోగం
ఆరోగ్యానికి
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాసనాలు వేస్తున్న నగర ప్రజలు, విద్యార్థులు
విజయవాడస్పోర్ట్స్/గాంధీనగర్: నిత్య యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హితవు పలికారు. భారత దేశ వారసత్వ సంపద అయిన యోగా భవిష్యత్తులో గేమ్ చేంజర్ అవుతుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా అధికార యంత్రాంగం శనివారం విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల రోజుల పాటు నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, యోగా ఆసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్, మాజీ సైనికులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో యోగాసనాల సాధన చేశామన్నారు. జిల్లాలోని 605 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 5,454 ప్రాంతాలలో 8.50 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, మానసిక ప్రశాంతత కలిగి ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటూ స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుని ఆర్థిక పురోగతికి దోహదపడాలని పిలపునిచ్చారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత మన భారతీయులదే కావడం గర్వకారణమన్నారు. ప్రతి ఉద్యోగి రోజులో కొంత సమయాన్ని యోగాకు కేటాయించడం వల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరిగి రక్త ప్రసరణ మెరుగవుతుందన్నారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు మాట్లాడుతూ కృష్ణానదిలో వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డు నమోదు కావడం మన జిల్లాకు గర్వకారణమన్నారు. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్టేడియం వద్ద మొక్కలు నాటారు. యోగా విశిష్టతను తెలిపేలా ప్లకార్డులతో ర్యాలీ చేశారు. ఫ్లోటింగ్ యోగాలో ముఖ్య భూమిక నిర్వహించిన యోగా అసోసియేషన్ సభ్యులకు, నెల రోజుల పాటు యోగా మాసోత్సవాలలో పాల్గొన్న జిల్లా అధికారులు, సిబ్బందికి కలెక్టర్ లక్ష్మీశ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, మాజీ మంత్రి పీతల సుజాత పాల్గొని యోగాసనాల సాధన చేయించారు.
యోగాంధ్రతో ఆరోగ్యాంధ్రప్రదేశ్
ఉయ్యూరు: రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే యోగాంధ్ర లక్ష్యమని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. ఉయ్యూరు శ్రీ విశ్వశాంతి పాఠశాల ఆవరణలో శనివారం యోగాంధ్ర కృష్ణా జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని సామూహిక యోగాసనాలు వేశారు. యోగా శిక్షకులు పోతన శాస్త్రి నమస్కార ముద్రా ప్రార్థనాగీతంతో యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాసనాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ప్రజల ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడటం ద్వారా రాష్ట్ర జీడీపీ పెరుగుతుందన్నారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి , ఎమ్మెల్యే బోడె ప్రసాద్ , జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్రావు, జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా యూనివర్సిటీ వీసీ కె.రాంజీ, ముడా చైర్మన్ మట్టా ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మహా యోగం

మహా యోగం

మహా యోగం

మహా యోగం

మహా యోగం