
యోగా.. వారసత్వ సంపదలో కలికితురాయి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారతీయ వారసత్వ సంపదలో యోగా కలికితురాయి అని వరల్డ్ రికార్డు యూనియన్ ప్రతినిధి ఎలీసా రేనాల్డ్స్ అన్నారు. కృష్ణా నదిలో ‘యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగా’ ఈవెంట్ను నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించడం అభినందనీయమన్నారు. ఇటీవల కృష్ణా నదిలో నిర్వహించిన ‘యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగా’ ఈవెంట్లో పడవలపై వేలాదిమంది యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు సాధించిన నేపథ్యంలో శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో వరల్డ్ రికార్డు యూనియన్ ప్రతినిధి ఫ్రాన్స్కు చెందిన ఎలీసా రేనాల్డ్స్.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు వరల్డ్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రేనాల్డ్స్ మాట్లాడుతూ భారతదేశం యోగాసనాలతో ప్రపంచానికి అమూల్యమైన బహుమతి ఇచ్చిందన్నారు. యోగా వంటి ఆరోగ్య విధానం బృహత్తర రికార్డులకే పరిమితం కాకూడదని, అందరూ తప్పక ఆచరించాలని ఎలీసా రేనాల్డ్స్ సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ టీమ్ ఎన్టీఆర్ కృషి.. ప్రజలు స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు అందరి సహకారంతోనే వరల్డ్ రికార్డు సాధించగలిగామన్నారు. కార్యక్రమంలో లంకా దినకరన్, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, సబ్కలెక్టర్ కె.చైతన్య, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో తరుణ్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు.
వరల్డ్ రికార్డు యూనియన్ ప్రతినిధి (ఫ్రాన్స్)ఎలీసా రేనాల్డ్స్