
బై..పాస్ అయ్యేదెన్నడో!
విజయవాడ వెస్ట్ బైపాస్
విజయవాడ వెస్ట్ బైపాస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పనులు దాదాపు పూర్తయినా ప్రారంభం మరింత ఆలస్యమవుతోంది. హైటెన్షన్ విద్యుత్ లైన్ల సమస్య కారణంగా పలుచోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కూడా దీనిపై నిర్లక్ష్యం చూపడంతో ఏడాదిగా పనులు అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం అలసత్వం వదిలి వెస్ట్ బైపాస్ ప్రారంభానికి చొరవ చూపాల్సి ఉంది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వెస్ట్ బైపాస్ రహ దారిని అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్నా పనులు సాగడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు, విజయవాడ ఎన్హెచ్ఏ ఆర్వో కార్యాలయ అధికారి అలసత్వం తోడైందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
మరింత ఆలస్యం
గత ప్రభుత్వ హయంలో.. రైతుల ముసుగులో టీడీపీ నాయకులు చేసిన కుట్రే నేడు శాపమైంది. ఆ చిక్కుముడే ఇప్పుడు ప్రతిబంధకంగా మారింది. విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తయితే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ఆశించిన ప్రజల కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. మరింత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం, ఎన్హెచ్ఏ ఆర్వో కార్యాలయ అధికారులు చిత్త శుద్ధితో పనులను పూర్తి చేసేందుకు కృషి చేయక పోవడంతో జాప్యం జరుగుతోంది.
టవర్ల మార్పిడి వెనక అక్రమాలు!
అయితే వీటి మార్పిడికి విజయవాడ ఆర్వో కార్యాలయం అధికారులు రూ.32.58 కోట్లు అంచనాలు వేశారు. మూతబడిన సంస్థకు సూపర్వైజేషన్కు చార్జీల కింద రూ.50 లక్షల పైగా చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో మూత పడిన ల్యాంకో పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన ల్యాంకో ట్రాన్స్మిషన్ టవర్ల మార్పిడి వెనుక భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని రైతులు కోర్టు మెట్లు ఎక్కారు. రైతులను ఇబ్బంది పెడుతున్న వ్యవహారంలో ఎన్హెచ్ఏ, రాధా టీఎంటీ, పాత ల్యాంకో యాజమాన్యాల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది. ఎన్హెచ్ఏ ఆర్వో కార్యాలయ అధికారి చొరవ చూపటం లేదు. ఆ ప్రాంతంలో టవర్లు మార్చితే, తమ పొలాలు పోతాయనే ఉద్దేశంతో రైతులు అడ్డుకుని టవర్ల ఎత్తు పెంచితే సరిపోతుందనే వాదనకు వారు తెర లేపారు. ప్రభుత్వం తలొగ్గి టవర్ల ఎత్తు పెంపునకు నిర్ణయం తీసుకున్నా.. కోర్టులో ఉన్న కేసు ఇప్పుడు ప్రతిబంధకంగా మారింది. దీనికి పరిష్కారం చూపడంలో ప్రభుత్వంతోపాటు, ఎన్హెచ్ఏ ఆర్వో కార్యాలయ అధికారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
పూర్తయితే ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఈ బైపాస్ పనులు పూర్తి అయితే , విజయవాడ నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బైపాస్ అందుబాటులోకి వస్తే విజయవాడ–విశాఖపట్నం, విశాఖపట్నం–విజయవాడ, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగంగా ఉండేది. ఉదాహరణకు చినఅవుటుపల్లినుంచి వారధి వరకు ప్రయాణం చేయాలంటే గంటనుంచి గంటన్నర సమయం పడుతోంది. ఇదే వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వస్తే కేవలం 15 నిముషాలలోపే చేరుకొనే అవకాశం ఉంది. దీనికితోడు విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు గత ప్రభుత్వ హయంలో డీపీఆర్ సిద్ధం చేసిన తూర్పు బైపాస్ రోడ్డు పనులకు కూటమి ప్రభుత్వం మోకాలు అడ్డుపెట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు సాకుగా చూపి దీనికి మంగళం పాడింది.
గత ప్రభుత్వ హయాంలో..
గత ప్రభుత్వ హయంలోనే 98 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు శరవేగంగా ముందుకు సాగాయి . కేవలం ప్యాకేజి –3 కింద చిన అవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30కిలోమీటర్ల బైపాస్ నిర్మాణానికి సంబంధించి కేవలం 300 మీటర్ల మేర మాత్రమే మిగిలింది. 2024 జనవరిలో ప్రజలకు బైపాస్ను అందుబాటులోకి తెచ్చే యత్నం చేసింది. టవర్ల షిఫ్టింగ్ , సాంకేతిక సమస్యలను సాకుగా చూపి, టీటీపీ నేతలే రైతుల ముసుగులో పనులను అడ్డుకున్నారు. రూ.1,148కోట్లతో , పనులను మెగా సంస్థ ఫిబ్రవరి 2021లో చేపట్టింది. ఈ రహదారి కోసం 14 గ్రామాల్లో భూసేకరణ చేశారు. కృష్ణా జిల్లాలో వెదురుపావులూరు, రామచంద్రాపురం, కొండపావులూరు, బీబీ గూడెం, గన్నవరం, చిన్న అవుటుపల్లి, ఎన్టీఆర్ జిల్లాలో గొల్లపల్లి, జక్కంపూడి, అంబాపురం, పి.నైనవరం, పాతపాడు, కెవీ కండ్రిక, నున్న గ్రామాల పరిధిలో మొత్తం 188.92 హెక్టార్ల భూమిని సేకరించారు. దీనికోసం రూ.416.60 కోట్లు ఖర్చు చేశారు.
వెస్ట్ బైపాస్ ప్రారంభమెప్పుడో! చినఅవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల మేర బైపాస్ 98 శాతానికి పైగా పనులు పూర్తి గత ప్రభుత్వంలో రోడ్డు పనులుప్రారంభం కాకుండా కుట్ర కొలిక్కి రాని ల్యాంకో టవర్ల సమస్య పట్టించుకోని ప్రభుత్వం
ల్యాంకో ట్రాన్స్మిషన్ల టవర్ల
ప్రధానంగా బైపాస్ రోడ్డుకు మధ్యలో హై ఓల్టేజీ విద్యుత్తు లైన్లు వెళుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఒకచోట, ఎన్టీఆర్ జిల్లాలో 12 చోట్ల ఏపీ ట్రాన్స్కో, ల్యాంకో, పవర్గ్రిడ్కు సంబంధించిన విద్యుత్ లైన్లను మార్చాలింది. ఇందులో గత ప్రభుత్వం చొరవ చూపటంతో కోర్టు కేసులను అధిగమించి రూ.15 కోటత్లో ఏపీ ట్రాన్స్కో, పవర్ గ్రిడ్ విద్యుత్ లైన్లను మార్చారు. అయితే ప్రస్తుతం 300 మీటర్లు జక్కంపూడి, గొల్లపూడి మధ్య ల్యాంకో ట్రాన్స్మిషన్ టవర్ల మార్పిడి సమస్య జటిలంగా మారింది. ల్యాంకో చెందిన ట్రాన్స్ మిషన్కు సెంట్రల్ ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ కమిటీ నుంచి లైసెన్సు లేదు. ఈ లైసెన్సు లేని సంస్థకు చెందిన టవర్లను మార్చే అధికారం ఎన్హెచ్ఏకు లేదు.

బై..పాస్ అయ్యేదెన్నడో!