
విలీనం కాదు... వినాశకరం
శాతవాహన వివాదంపై నిజనిర్ధారణ కమిటీ వేయాలి
విజయవాడలీగల్: సుదీర్ఘ కాలంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యనందించి, ఉన్నత స్థానాల్లో నిలిపిన శాతవాహన కళాశాల ప్రాంగణం కొంతకాలంగా వివాదాలతో కొట్టుమిట్టాడుతోంది. దీనిపై పూర్వవిద్యార్థులు, న్యాయవాదులతో ఒక నిజనిర్ధారణ కమిటీ వేయాలని అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. బెజవాడ బార్ అసోసియేషన్ హాలులో బీబీఏ అధ్యక్షుడు ఎ.కె.బాషా ఆధ్వర్యంలో శనివారం శాతవాహన కళాశాల పరిరక్షణ కోరుతూ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే కళాశాలను అర్ధరాత్రి జేసీబీలతో కూల్చివేశారని, కూల్చివేతపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విద్యార్థుల సర్టిఫికెట్లు, ఇతర విలువైన పత్రాలు కూడా ధ్వంసం చేశారని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల కమిటీలో అంతర్గత విభేదాల కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నడూ లేనిది విజయవాడ నగరంలో కూడా బుల్డోజర్ సంస్కృతి వచ్చిందని, అర్ధరాత్రి సమయాల్లో సినిమా థియేటర్లు, కాలేజీలు కూల్చివేయడం బాధాకరమన్నారు. పేద వర్గాలకు విద్యను అందించే లక్ష్యంతో 1970లలో నగరంలో ఏర్పడిన శాతవాహన కళాశాలను రక్షించేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు కదలాలని అన్నారు. దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ లో ఉన్న అవకతవకలు బహిర్గతం చేయాలని కోరారు. ఈ సమస్యపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ జోక్యం చేసుకుని కళాశాలను పునఃప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కార్యదర్శి డి.విష్ణువర్ధన్, కార్యదర్శి మోతుకూరి అరుణ కుమార్, వల్లూరు నాగబాబు తదితరులు పాల్గొన్నారు