
సాక్షి, పల్నాడు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతల టార్గెట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులపై పోలీసుల అక్రమ కేసులు పెట్టారు. ఫిర్యాదులో పలువురు నేతల పేర్లను పేర్కొన్నారు.
👉ఇక, వైఎస్సార్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. పుష్ప-2 సినిమాలో డైలాగు పోస్టర్ రూపంలో చూపించిన బోల్లెద్దు రవితేజ కేసులో గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. ఈ కేసులో 223, 352, 351(2), 189(3), 192, 61(2), 126(2), 288, 298, 192 BNS r/w 190(2), BNS నాన్ బెయిల్ బుల్ సెక్షన్లతో కేసు నమోదు చేయడం గమనార్హం.
👉అలాగే, రాజుపాలెం మండలం బలిచేపల్లికి చెందిన మేరుగ రాధాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్ బుక్లో వచ్చిన పోస్టును ఆమె.. ఫార్వర్డ్ చేసినందుకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయడం విశేషం.
👉మాచర్ల వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడు కొండా శీనును నిన్న సాయంత్రం గుంటూరులో దుర్గి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు కొండా శీనును పోలీసులు తీసుకెళ్లారు. అయితే, కొండా శీనుకు సంబంధించిన సమాచారం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.
