తవ్వేద్దాం..
ఎన్టీఆర్ జిల్లాలో యథేచ్ఛగా మట్టి దందా
మైలవరం మండల పరిధి పొందుగల ఎర్ర చెరువులో గ్రావెల్ తవ్వకాలు
జి.కొండూరు: అధికారమే అండగా టీడీపీ నాయకులు చెరువులపై ఎగబడుతున్నారు. పదుల సంఖ్యలో పొక్లెయిన్లు, వందల సంఖ్యలో ట్రాక్టర్లతో చెరువులను గుల్ల చేస్తున్నారు. రైతుల పేరుతో పొలాలకు మెరక కోసం అంటూ అనుమతులు పొందుతూ.. చెరువులలో మట్టి, గ్రావెల్ని ఇటుక బట్టీలు, వెంచర్లకు తరలించి రూ.కోట్లు బొక్కేస్తున్నారు. వారం రోజులుగా చెరువులు, రహదారులు దుమ్ము లేచిపోతున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే అక్రమ సొమ్ము ఒకరిద్దరే తింటే ఎలా? తమకూ వాటా కావాలంటూ కూటమిలోనే వేరే వర్గపు నేతలు గలాటా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చెరువుల వైపు కన్నెత్తి చూడడం లేదు.
మారిపోతున్న భౌతిక స్వరూపం..
చెరువులలో మట్టి, గ్రావెల్ తవ్వకాల కోసం ఇష్టారాజ్యంగా చెరువుల వాలును బట్టి కాకుండా చెరువులో మట్టిని తవ్వేందుకు ఎక్కడ సులువుగా ఉంటే అక్కడ భారీ గొయ్యిలు పెట్టి తవ్వేస్తున్నారు. దీని వల్ల చెరువుల భౌతిక స్వరూపాలే మారిపోతున్నాయి. ఈ భారీ గొయ్యిల వల్ల చెరువులో ఉన్న నీరు తూములలోకి వచ్చే అవకాశం లేక రైతులు సాగునీటి ఎద్దడి వచ్చినప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
గ్రామ పంచాయతీలకు ఆదాయం నిల్..
చెరువులలో మట్టిని, గ్రావెల్ని యథేచ్ఛగా తరలించి ఒకరిద్దరు అధికార పార్టీ నాయకులు బాగుపడడం తప్ప ఆయా గ్రామాలకు ఒరిగేదేమీ లేదు. అదే గ్రామ పంచాయతీలకు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టి మట్టి తరలింపునకు ప్రతి క్యూబిక్ మీటరుకు ఇంత అని లెక్క కట్టి గ్రామ పంచాయతీలకు చెల్లించేలా జీవో విడుదల చేస్తే నిధులు గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అయితే గ్రామ పంచాయతీల సర్పంచ్లు అధికంగా వైఎస్సార్ సీపీకి చెందిన వారే ఉండడంతో ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎర్ర చెరువులో ఎగబడ్డారు...
మైలవరం మండల పరిధి పొందుగల ఎర్ర చెరువులో గ్రావెల్ లభ్యత ఎక్కువగా ఉండడంతో అక్కడి టీడీపీ నాయకులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టారు. గత వారం రోజులుగా తవ్వకాలు జరుపుతూ పరిసర ప్రాంతాలలోని ఇళ్ల స్థలాలు, వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క ట్రాక్టరు ట్రక్కు గ్రావెల్ని రూ.1200కి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులకు సమాచారం అందించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
జిల్లాలో తవ్వకాలు ఇలా..
● తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలం కొండపర్వ చెరువులో తవ్వకాలు జరిపారు.
● జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు మండలం కొణకంచి చెరువు నుంచి బండిపాలెం వెంచర్లకు గత మూడు రోజులుగా రాత్రి సమయాల్లో మట్టిని తరలిస్తున్నారు.
● నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలం కంచికచర్ల, గొట్టిముక్కల, పేరకలపాడు, వీరులపాడు మండల పరిధిలోని జుజ్జూరు, పెద్దాపురం గ్రామాల్లోని చెరువులలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
● మైలవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండల పరిధిలో కొత్తూరు, మైలవరం మండలం పొందుగల, చంద్రాల, బొర్రగూడెం, రెడ్డిగూడెం మండలం నాగులూరు, జి. కొండూరు మండలం చిన్ననందిగామ, కుంటముక్కల, కోడూరు, వెల్లటూరు, ఆత్కూరు, చెవుటూరు, మునగపాడు, కవులూరు గ్రామాల్లోని చెరువుల్లో భారీగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.
పగలు, రాత్రి తేడా లేదు..
చెరువులను చెరబడుతున్న పచ్చ నేతలు
పొలాలకు మెరక కోసం అంటూ రైతుల పేరుతో అనుమతులు
వెంచర్లు, ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం
కోట్ల రూపాయల మట్టి తరలిపోతున్నా కన్నెత్తి చూడని అధికారులు
గ్రామ పంచాయతీలకు
దక్కని ఆదాయం
అడ్డగోలుగా తవ్వితే అనర్థమే..
చెరువులలో నిబంధనల మేరక పూడికతీసి మట్టిని రైతుల అవసరాలకు మాత్రమే తరలించాలి. అలా కాకుండా ఇష్టా రాజ్యంగా పది అడుగుల లోతు వరకు తవ్వి మట్టిని అమ్ముకోవడం వల్ల ఒకరిద్దరే బాగుపడతారు. ఇలా తవ్వకాలు జరపడం వల్ల రైతులకు నష్టం జరుగుతుంది. చెరువులో నీరు ఉన్నప్పటికీ భారీ గోతుల వల్ల నీరు తూములలోకి రాకపోవడంతో సాగునీటి ఎద్దడి సమయంలో రైతులు నష్టపోతారు. అంతేకాక చెరువులో దిగినప్పుడు మనుషులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
– పీవీ ఆంజనేయులు,
రైతు సంఘం జిల్లా కార్యదర్శి
ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాల్లో రేయింబగళ్లు చెరువులలో మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క చెరువు నుంచి రోజుకి 2 నుంచి 3వేల ట్రాక్టరు ట్రక్కులు అంటే రోజుకి 7వేల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తరలిపోతోంది. ఒక ట్రాక్టర్ మట్టికి రూ.1200 వరకు వసూలు చేస్తుండగా ట్రాక్టరు, పొక్లెయిన్ల కిరాయి పోను రోజుకి రూ.15లక్షల నుంచి రూ. 20లక్షల వరకు టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్తోంది. మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ల డ్రైవర్లు ఎక్కువ ట్రిప్పులు వేయాలనే పోటీతో వేగంగా నడుపుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అమ్మేద్దాం!
అమ్మేద్దాం!