మన దేశ సాంస్కృతిక వారసత్వ సంపద యోగ | - | Sakshi
Sakshi News home page

మన దేశ సాంస్కృతిక వారసత్వ సంపద యోగ

Jun 19 2025 7:48 AM | Updated on Jun 19 2025 7:48 AM

మన దేశ సాంస్కృతిక వారసత్వ సంపద యోగ

మన దేశ సాంస్కృతిక వారసత్వ సంపద యోగ

భవానీపురం(విజయవాడపశ్చిమ): భారత దేశానికి మాత్రమే సొంతమైన సాంస్కృతిక వారసత్వ సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం యోగాంధ్ర – 2025 మాసోత్సవాలను నిర్వహిస్తోందని మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, కందుల దుర్గేష్‌ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి డాన్‌బోస్కో స్కూల్‌లో ఈ నెల 16,17,18 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో 15 కేటగిరీలలో 42 అంశాలపై 526 మంది పాల్గొనగా 193 మందిని విజేతలుగా ఎంపిక చేసి వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా 103 పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి ఆయా ప్రదేశాల ఔన్నత్యాన్ని చాటి చెప్పామన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ నేతృత్వంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించిన థీమాటిక్‌ ఫ్లోటింగ్‌ యోగా ప్రపంచ రికార్డ్‌ సాధించినందుకు గర్వంగా ఉందన్నారు.

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సొంతం అవుతాయని అన్నారు. ఐరోపా దేశాల్లో సైతం భారతీయ యోగా, వెల్‌నెస్‌కు మంచి పేరుందని, ఆ విషయాన్ని ఇటీవల తన బెర్లిన్‌ పర్యటనలో గుర్తించినట్లు తెలిపారు. ఆయుష్‌ డైరెక్టర్‌ కె.దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ పోటీల్లో విజేతలుగా నిలిచినవారు ఈ నెల 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీతో కలిసి యోగాసనాల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగాభ్యాసం ఒక భాగం కావాలని ఆకాంక్షించారు.

ఈవెంట్‌ కాదు..మూవ్‌మెంట్‌

కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ మాట్లాడుతూ యోగాంధ్ర అనేది ఒక ఈవెంట్‌ కాదని, గొప్ప మూవ్‌మెంట్‌ అని అభివర్ణించారు. కళాత్మక యోగాతో యోగా గొప్పదనాన్ని చాటిచెప్పేందుకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలను ఏర్పాటు చేయడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.సుహాసిని, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ డి.చంద్రశేఖర్‌, ఆయుష్‌ అధికారులు డాక్టర్‌ వి.రాణి, డాక్టర్‌ రామత్లేహి, డాక్టర్‌ రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి యోగా అండ్‌ ఏరోబిక్స్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంతో సాగిన కళారూపకం ఆహూతుల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. ప్రజ్ఞ యోగ, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ప్రదర్శనతో పాటు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, కందుల దుర్గేష్‌ యోగా పోటీల్లో విజేతలకు బహుమతీ ప్రదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement