
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యోగాసనాల సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని.. ఆరోగ్యమే మహా భాగ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ వివిధ బ్యాంకుల అధికారులు, సిబ్బంది, వాసవి ఇంటర్నేషనల్ క్లబ్స్ సభ్యులతో కలిసి యోగాసనాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం బాగుంటే వైద్య ఖర్చుల రూపంలో చేసే వ్యయం తగ్గటం వల్ల వారిలో డబ్బులు పొదుపు చేసే సంస్కృతి పెరుగుతుందని.. అది వ్యక్తి శ్రేయస్సుకు, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇదే వేదికపై కొన్ని రోజుల కిందట వైద్యులు కూడా యోగా సాధన చేశారని.. వారి ప్రసంగాల్లో సైతం యోగాసనాలు ఆచరించడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం ప్రజలకు లభిస్తుందని తెలిపారన్నారు. యోగ సాధన విశిష్టతపై బ్యాంకర్లు తమ ఖాతాదారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు.
ఆనందంగా ఉంది...
యూబీఐ రీజనల్ హెడ్ ఎంవీ తిలక్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంటర్నేషనల్ వాసవీ క్లబ్ పూర్వపు అధ్యక్షుడు వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ భారతదేశ సాంస్కృతిక, వారసత్వ సంపద అయిన యోగా సాధనను ప్రపంచానికి చేరువచేయడంలో ప్రధాని విజయవంతమయ్యారన్నారు. ఎస్ఎల్బీసీ సీఎం గౌతమ్ లక్ష్మీనారాయణ, ఎల్డీఎం కె.ప్రియాంక, ఎస్బీఐ ఆర్ఎం శ్రీనివాస్, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ రాజేష్, ఏపీజీబీ ఆర్ఎం ప్రసాద్, కేడీసీసీ జీఎం రంగబాబు, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.