
పోలీస్ ప్రజావాణిలో 78 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: శనగరంలోని పోలీస్ కమిషనరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 78 ఫిర్యాదులను స్వీకరించినట్లు డెఫ్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఎ.బి.టి.ఎస్.ఉదయరాణి తెలిపారు. ఆస్తి, నగదు వివాదాలపై 49, కుటుంబ కలహాలపై మూడు, మహిలళా సంబంధిత నేరాలపై నాలుగు, చోరీలపై ఐదు, కొట్లాటలపై ఎనిమిది, ఇతర సంఘటనలపై తొమ్మిది మంది ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన అనంతరం సదరు ఫిర్యాదులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆమె ఆదేశించారు.
కెనాయింగ్ జాతీయ పోటీల్లో వర్షిత సత్తా
విజయవాడస్పోర్ట్స్: మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన 35వ కెనాయింగ్ కయాకింగ్ స్ప్రింట్ చాంపియన్షిప్లో విజయవాడ క్రీడాకారిణి గోగులూరి వర్షిత సత్తా చాటింది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు జరిగిన ఈ పోటీల్లో సబ్ జూనియర్ 500 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్కు వర్షిత ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకాన్ని సాధించింది. వర్షిత పటమటలోని ఎన్ఎస్ఎం స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటోంది. ప్రతిష్టాత్మకమైన జాతీయ పోటీల్లో పతకం సాధించిన క్రీడాకారిణి వర్షితను ఎన్ఎస్ఎం స్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ రాయప్పరెడ్డి, ఏపీ కెనాయింగ్ కయాకింగ్ సంఘం కార్యదర్శి శివారెడ్డి అభినందించారు.
ఐటీఐల్లో ప్రవేశానికి అడ్మిషన్లు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించామని ఐటీఐ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.కనకరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 24వ తేదీలోగా ఐటీఐ. ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారితో పాటు 8వ తరగతి పాస్ అయిన వారికి కూడా కొన్ని ట్రేడ్ల్లో అడ్మిషన్లు ఇస్తున్నామని ఆయన వివరించారు. విజయవాడ రమేష్ ఆస్పత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశామని తెలిపారు. వివరాలకు 94906 39639 నంబర్లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.

పోలీస్ ప్రజావాణిలో 78 ఫిర్యాదులు