
● అన్నదాతల బలవన్మరణం ● గిట్టుబాటు కాని పంటలు ● అందని పర
పాలకుల భరోసా కరువై.. అప్పుల సాగు చేస్తున్న అన్నదాత బలవన్మరణం చేసుకోవాల్సి వస్తోంది. పంటలు పంటక.. గిట్టుబాటు ధర రాక.. అప్పులు తీర్చలేక రైతు ఉసురు తీసుకుంటున్నాడు. కుటుంబ పెద్దను కోల్పోయిన అన్నదాతల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం బాధిత కుటుంబాలకు శాపంగా మారుతోంది. వీరికి పరిహారాన్ని పాలకులు సరైన సమయంలో అందజేయకపోవడంతో రైతుల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇటీవల కాలంలో అన్నదాతల బలవన్మరణాలు జరుగుతున్నాయి. పండిన పంటకు ధర రాక.. ప్రభుత్వం పట్టించుకోపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అప్పలభారం భరించలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడిన రైతులకు ప్రభుత్వం రూ. 7లక్షల ఎక్స్గ్రేషియా అందించాల్సి ఉంది. ఇది సకాలంలో ఇవ్వడం లేదు. దీనికి కారణం నిబంధనలు ప్రతిబంధకంగా మారడమే. ఆత్మహత్యకు పాల్పడిన రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు అన్ని అర్హతలు ఉన్నా.. కొందరు అధికారులు కొర్రీలు వేస్తున్నారు. వీఆర్వో నుంచి కమిషనర్ వరకు వివిధ స్థాయిల్లో నెలల తరబడి ఎక్స్గ్రేషియా అంశం పెండింగ్లో ఉంటోంది.
వివిధ స్థాయిల్లో పెండింగ్
ఎన్టీఆర్ జిల్లాలో గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 8 మంది రైతులు, కౌలు రైతులు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదుగురు రైతుల ఎక్స్గ్రేషియా ఫైల్స్ వివిధ స్థాయిల్లో పెండింగ్లో ఉన్నాయి. మరో ముగ్గురు రైతులకు సంబం ధించి వీఆర్వో, తహసీల్దార్ స్థాయిలోనే ఎటూ తేలకుండా నిలిచిపోయి ఉన్నాయి. పంచనామా, పోస్టుమార్టం వంటి ప్రక్రియలు పూర్తైనా ఎక్స్గ్రేషియా ఫైల్ ముందుకు కదలడం లేదు. వత్సవాయి మండలం భీమవరానికి చెందిన పిట్టంపల్లి కోటయ్య, కొత్త వేమవరానికి చెందిన కస్తూరి గోపి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఫైల్స్ ఏ దశలో ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి.
అన్నదాత సుఖీభవ ఏమైంది..?
అధికారంలోకి రాగానే రైతులకు ఏటా రూ. 20వేలు పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్న రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా పేరు మార్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యవసాయ సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లు ముగిశాయి. కానీ అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న పెట్టుబడి సాయం ఏమైందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇక రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఊసే లేదు. మరింత మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడకముందే ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తోంది చిట్టిబొమ్మ చిన్ని కృష్ణ, ఊరు గంపలగూడెం మండలం అనుముల్లంక. ఇతనికి 1.80 ఎకరాలు సొంత భూమి ఉంది. దీనితోపాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని ఆ భూమిలో మిర్చి సాగు చేశాడు. పెట్టుబడులు, ఎరువులు పురుగు మందుల కోసం వేర్వేరు చోట్ల రూ.20లక్షలు అప్పు చేశాడు. సొంత భూమిని తనఖాపెట్టి మరికొంత అప్పు తెచ్చాడు. పంటల్లో పూర్తిగా నష్టం వచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. నిత్యం తన అప్పులు ఎలా తీరుతాయంటూ కుటుంబ సభ్యుల వద్ద బాధపడుతూ పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఆ కుటుంబం పరిహారం కోసం ఎదురు చూస్తోంది.
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు పిట్టంపల్లి కోటయ్య. వత్సవాయి మండలం భీమవరంలో కౌలు రైతు. గ్రామంలో దేవదాయ శాఖకు చెందిన మూడున్నర ఎకరాలు, రైతుల నుంచి మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి, పత్తిపంటలు సాగు చేశాడు. కౌలు, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి. దిగుబడులు తగ్గిపోయాయి. అప్పులు కుప్పయ్యాయి. కుటుంబ పోషణ భారంగా మారింది. మానసికంగా కుంగి పోయాడు. లెక్కలు చూసుకోగా రూ.10 లక్షల అప్పు తేలింది. వాటిని తీర్చే మార్గం లేక తాను కౌలుకు చేస్తున్న పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని కుటుంబం రోడ్డున పడింది. ఆ కుటుంబం ప్రభుత్వం అందించే పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. భార్య త్రివేణి, కుమారుడు బాలకృష్ణ, కుమార్తె సాత్విక కోటయ్యను తలచుకొని విలపిస్తున్నారు. భర్త మరణంతో దిక్కుతోచని స్థితిలో త్రివేణి కూలి పనులకు వెళుతూ పిల్లను ప్రభుత్వ బడిలో చేర్చింది. అప్పుల వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. తనను ఆదుకోవాలంటూ గత నెలలో పీజీఆర్ఎస్లో కలెక్టర్కు అర్జీ పెట్టుకుంది.
ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
రైతు ఆత్మ హత్యకు పాల్పడితే పంచనామా రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. జాప్యం చేయకుండా నెల వ్యవధిలోనే అందజేయాలి. అప్పుడే బాధితులపై అప్పుల వాళ్ల వత్తిడి తగ్గుతుంది. శాఖల మధ్య సమన్వయం ఉండాలి.
– పి.జమలయ్య,
కౌలు రైతు సంఘం
దిక్కు
తోచని
స్థితిలో
ఎక్స్గ్రేషియా పెండింగ్....
ఆత్మహత్య చేసుకున్న రైతులు ఏ దశలో పెండింగ్
గుడిపాటి నాగభూషణం చందర్లపాడు మండలం, కొడవటికల్లు కమిషనర్ స్థాయిలో
పసుపులేటి పూర్ణచంద్రరావు వెలది కొత్తపాలెం కమిషనర్ స్థాయిలో
చిట్టిబొమ్మ చిన్ని కృష్ణ, అనుముల్లంక, గంపలగూడెం తహసీల్దార్ స్థాయిలో
మార్తి తిరుపతిరావు షేర్ మహ్మద్ పేట, జగ్గయ్యపేట తహసీల్దార్ స్థాయిలో
నల్లమట్టి రాంబాబు జయంతిపురం, జగ్గయ్యపేట ఆర్డీఓ స్థాయిలో

● అన్నదాతల బలవన్మరణం ● గిట్టుబాటు కాని పంటలు ● అందని పర

● అన్నదాతల బలవన్మరణం ● గిట్టుబాటు కాని పంటలు ● అందని పర

● అన్నదాతల బలవన్మరణం ● గిట్టుబాటు కాని పంటలు ● అందని పర